సోషల్‌ విూడియా విమర్శలు… పట్టించుకోవాల్సిన పనిలేదన్న జాన్వీ!

ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన జాన్వీకపూర్‌ కోలుకుని ఇంటికి చేరుకుని.. రెండ్రోజుల్లోనే మళ్లీ యాక్టివ్‌ అయ్యాక వరుస ప్రమోషన్లో పాల్గొంటున్నారు. తన తదుపరి చిత్రం ‘ఉలర్‌’ చిత్రం విడుదల నేపథ్యంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్‌విూడియా ట్రోల్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఆన్‌లైన్‌ వేదికగా స్టార్‌కిడ్స్‌ ఎదుర్కొంటున్న విమర్శలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సోషల్‌ విూడియాలో వచ్చే విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాటిని పట్టించుకోవడం కూడా వృథా. ఎందుకంటే, సోషల్‌విూడియా కల్చర్‌ అది. పబ్లిక్‌ ఫిగర్‌ అయినా, కాకపోయినా ఇలాంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కామెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక విషయంలో ఈరోజు పొగిడినవాళ్లే అదే విషయంపై రేపు తిడతారు. ముక్కూ, మొఖం తెలియని వాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవడం దేనికి?. మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి‘ అని అన్నారు.

అనంతరం అనంత్‌ అంబానీ సతీమణి రాధిక మర్చంట్‌ కోసం పార్టీ ఇవ్వడంపైజాన్వీ మాట్లాడారు. ‘రాధిక నాకు మంచి ఫ్రెండ్‌. తను మాతో చాలా సరదాగా ఉంటుంది. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే, వివాహానికి ముందు ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటుచేయాలని ఫ్రెండ్స్‌ అందరం అనుకున్నాం. అందులో భాగంగా గ్రాండ్‌ పార్టీ ఇచ్చాం. తను చాలా సంతోషించింది‘ అని చెప్పారు. ’ఉలర్‌’ విషయానికి వస్తే.. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. జాన్వీ ఇందులో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిణిగా కనిపించనుంది. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌లో గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌ ముఖ్య పాత్రలు పోషించారు.