నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబో.. హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ అంటూ వార్తలు!

‘దసరా’ సినిమా కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నాని, శ్రీకాంత్‌ ఓదెల కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్‌ని ఎంచుకొన్నట్టు వార్తలొస్తున్నాయి. చిత్రబృందం అధికారికంగా ఈ విషయంపై ఇంకా స్పందించకపోయినా జాన్వీ ఎంట్రీ దాదాపు ఖాయమేనని తెలుస్తోంది. జాన్వీకి మంచి క్రేజ్‌ ఉంది. తెలుగులో రెండు భారీ చిత్రాల్లో అవకాశం అందుకుంది. అయితే ఇప్పటికీ ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్‌ తుది దశలో ఉంది. రామ్‌ చరణ్‌-బుచ్చిబాబు కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమాలోనూ ఆమె కథానాయిక. ‘పుష్ష 2’లో ఐటెమ్‌ సాంగ్‌ కోసం జాన్వీ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు నాని అభిమానులు మరో చర్చ లేవనెత్తారు. నాని పక్కన జాన్వీ ఏమిటన్నది నేచురల్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ప్రశ్న.

‘నాని అన్నా.. నీకు జాన్వీ సెట్‌ కాదు..’ అంటూ కొంతమంది ఫ్యాన్స్‌ సోషల్‌ విూడియా వేదికగా సలమాలు ఇస్తున్నారు. జాన్వీ అక్కలా ఉంటుందని కొంతమంది సెటైర్లు విసురుతున్నారు. ‘దసరాలో కీర్తి సురేష్‌తో నీ జోడీ బాగుంది కదా, తననే తీసుకోండి’ అంటున్నారు. ‘హాయ్‌ నాన్న’లో మృణాల్‌ విషయంలో తప్పు చేశాడన్నది నాని అభిమానుల వాదన. ఆ సినిమాలో మృణాల్‌తో నాని కెమిస్టీ మిస్‌ మ్యాచ్‌ అయ్యిందని, నాని పక్కన మృణాల్‌ వయసు ముదిరిన పిల్లలా కనిపించిందన్న కామెంట్లు వినిపించాయి. జాన్వీ విషయంలోనూ అదే జరుగుతుందన్నది అభిమానులు బెంగపడుతున్నారు. మరి నాని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.