స్పెషల్ సాంగ్.! జాన్వీ ససేమిరా అనేసిందట.!

హీరోయిన్‌గా తొలి సినిమా రిలీజ్ కాకుండానే, స్పెషల్ సాంగ్ చేయడమేంటి.? ఇలా క్లాస్ తీసుకుందట ఓ టాలీవుడ్ నిర్మాతకి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీయార్ సరసన ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో జాన్వీ కపూర్‌కి తొలి సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రికార్డు స్థాయి రెమ్యునరేషన్, బోల్డన్ని కండిషన్స్ పెట్టి మరీ, తెలుగు సినిమాకి ఒప్పుకుంది జాన్వీ కపూర్.

అలాంటిది, జాన్వీ కపూర్ దగ్గరకి స్పెషల్ సాంగ్ ఆఫర్‌తో ఎలా వెళ్ళారబ్బా.? ఇంతకీ, ఎవరా నిర్మాత.? ఏమా కథ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ, పెద్ద బ్యానర్‌కి చెందిన నిర్మాత అనీ, ఓ యంగ్ హీరో నటిస్తున్న సినిమా అనీ తెలుస్తోంది.

బాలీవుడ్‌లో అయితే జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్స్ చేయడానికీ రెడీనే. తెలుగులో మాత్రం, ససేమిరా అనేయడానికి బలమైన కారణం వుంది. ఇక్కడ స్పెషల్ సాంగ్ చేస్తే, ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లుతాయ్ మరి.

కాగా, జాన్వీ కపూర్ ‘నో’ చెప్పడంతో, సదరు నిర్మాత, ప్రత్యామ్నాయంగా మృనాల్ ఠాకూర్ పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రష్మిక మండన్నతోనూ మంతనాలు జరుపుతున్నారట. అయినా, హీరోయిన్‌గా నటిస్తూ స్పెషల్ సాంగ్స్ చేస్తే అందులో తప్పేముంది.? తమన్నా చెయ్యట్లేదా.? పూజా హెగ్దే చెయ్యలేదా.?