ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి ట్రైనీలను ఉద్యోగాల నుంచి తొలగించింది. తాజాగా 195 మంది ట్రైనీలను కంపెనీ బయటకు పంపినట్లు సమాచారం. అంతర్గత అసెస్మెంట్ పరీక్షల్లో ఫెయిల్ అవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి ట్రైనీలను తొలగించడం గమనార్హం.
ఇప్పటి వరకు 2024 ప్రారంభం నుంచి మొత్తం 800 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ తొలగించినట్లు తెలుస్తోంది. వీరంతా 2022లో నియమితులయ్యారు. కానీ తుది శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ వర్గాల ప్రకారం, ఉద్యోగ నిబంధనల ప్రకారం ఇది సాధారణ ప్రక్రియగా వివరించారు.
అయితే తొలగించిన ట్రైనీలకు ఒక నెల జీతం ఎక్స్గ్రేషియా రూపంలో అందించనున్నారు. అలాగే, ఎన్ఐఐటీ, అప్గ్రాడ్ వంటి సంస్థల సహకారంతో ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 250 మంది ట్రైనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మరో 150 మంది ఔట్ప్లేస్మెంట్ సేవలకు నమోదు చేసుకున్నారు.
గత ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ 300 మందిని తొలగించింది. తరువాత మార్చిలో 30 మంది, ఏప్రిల్లో 240 మందిని తీసేసింది. తాజాగా మే నెలలో 195 మంది ట్రైనీలను తొలగించి మొత్తం సంఖ్యను పెంచింది. కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 15,000 ట్రైనీలను తీసుకునే ప్రణాళికను ముందుగా ప్రకటించింది.
ఈ తరహా తొలగింపులు ఉద్యోగార్ధుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రైనీ దశ నుంచే ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొనడం ఐటీ రంగంలో కొత్త చర్చకు దారితీస్తోంది. కంపెనీలు ఉద్యోగ నాణ్యతకు పెద్దపీట వేస్తున్న ఈ సమయాల్లో, ట్రైనీలకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం మరింత పెరిగినట్టే కనిపిస్తోంది.