‘కంగువ’ తరవాత పూజాతో సూర్య మరో సినిమా!

త్వరలో ‘కంగువా’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు తమిళ కథానాయకుడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన.. తన 44వ చిత్రం కోసం దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజుతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.

ఈ విషయాన్ని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను పంచుకుంది చిత్రబృందం. ‘లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. ‘సూర్య 44’ ప్రయాణం ప్రారంభమైంద‘ని వ్యాఖ్యల్ని జోడించింది. ఇందులో సూర్య సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లవ్‌ అండ్‌ వార్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తుంది. జోజు జార్జ్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.