క్రిస్మస్‌ కానుకగా ‘గేమ్‌ఛేంజర్‌’

టాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ రాంచరణ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ఛేంజర్‌’. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తోండగా.. దీనిపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా ఈ చిత్రం విడుదలకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తూనే ఉంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌పై ఎప్పుడు క్లారిటీ వస్తుందా అని డైలామాలో ఉండిపోయిన అభిమానుల కోసం ఆసక్తిక వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్‌ చేస్తోంది. రాంచరణ్‌ పీఆర్‌ టీం ప్రకారం ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇప్పటివరకు వచ్చిన వార్తలను కొట్టిపారేస్తూ.. తాజాగా ఇచ్చిన సమాచారంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. విడుదల తేదీపై ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు.

ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్‌, శ్రీకాంత్‌, బాలీవుడ్‌ నటుడు హ్యారీ జోష్‌, కోలీవుడ్‌ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో రాంచరణ్‌ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నట్టు తెలుస్తోండగా.. తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుందట. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తుండగా.. పాపులర్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అందిస్తున్నారు.