ఓటిటిలోకి వచ్చేసిన విశ్వక్‌ సేన్‌ ‘గామి’

విశ్వక్‌ సేన్‌, చాందినీ చౌదని హీరో హీరోయిన్లుగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ . కార్తిక్‌ శబరీష్‌ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్‌ కుమరన్‌ సంగీతాన్ని అందించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్‌ 12 నుంచి జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‌ స్నో కింగ్‌డమ్‌ లో విూడియాతో ముచ్చటించింది. స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్‌ విూట్‌ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. దీంతో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్‌ అవుతోంది.

ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్‌డమ్‌లో నిర్వహించాలనే ఐడియా అంతా కూడా జీ5 టీమ్‌దే. ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని కూడా ఇలా చలిలోనే చేసేవాడ్ని. ‘గామి’లాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు, ప్రశంసలు వస్తుంటాయి.. కలెక్షన్లు రావని అంతా అనుకుంటారు. కానీ ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌, కలెక్షన్లను సాధించింది. ‘గామిలో కమర్షియల్‌ అంశాలేవీ ఉండవు. అయినా ఆడియెన్స్‌ చాలా బాగా ఆదరించారు. వారణాసిలోని ఘాట్‌లో శవాలు కాలుతున్నా కూడా ఓ 20 నిమిషాలు షూట్‌ చేశాం. చావుని వాళ్లు సెలెబ్రేట్‌ చేసుకున్నారు. అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది. ఇలాంటి కథను నమ్మాలి. నాకు పెద్ద రిస్క్‌ అనిపించలేదు. ఓ ప్లాప్ సినిమాను తీయడం కంటే.. ఇలాంటి కథను నమ్మడం బెటర్‌. ‘గామి’ని థియేటర్లో అందరూ చూశారు. మాకు మంచి రివ్యూలు ఇచ్చారు. ఓటీటీలోనూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నానని అన్నారు.

డైరెక్టర్‌ విద్యాధర్‌ కాగిత మాట్లాడుతూ.. థియేటర్లో మా సినిమా కొంత మందికి అర్థం కాలేదనే కంప్లయింట్స్‌ వచ్చాయ్‌. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మూడు నాలుగు సార్లు చూస్తే మా థీమ్‌ ఏంటి? మా కాన్సెప్ట్‌ ఏంటి? అన్నది అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. మేం ఎప్పుడూ ఈ సినిమా కోసం లెక్కలు వేసుకోలేదు. చిన్నా, పెద్దా.. బ్జడెట్‌ అంటూ ఇలా లెక్కలేసుకుండా సినిమా తీశాం. అందరూ వీక్షించండని కోరారు.