ఏడేళ్ల జర్నీలో అన్నీ విజయాలే : రష్మిక

పాత్ర ఏదైనా..పరకాయ ప్రవేశం చేయడం..పక్కింటి అమ్మాయిలా మెప్పించడం ఆమె నైజం. అందుకే అతి తక్కువ సమయంలో నేషనల్‌ క్రష్‌గా అందరి మదిలో నిలిచిపోయింది రష్మిక మందన్నా. కన్నడ ‘కిరాక్‌ పార్టీ’తో హీరోయిన్‌ గా కెరీర్‌ మొదలుపెట్టిన రష్మిక ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగింట అతి తక్కువ సమయంలో స్టార్‌ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. చక్కని విజయాలు అందుకుంది. ‘పుష్ప’ చిత్రం సక్సెస్‌తో నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఉంది.

ఇటీవల ‘యానిమాల్‌’తో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రష్మిక సినీరంగంలోకి అడుగుపెట్టి ఏడేళ్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ”నా ఈ సినీప్రయాణంలో కొన్నిసార్లు వెనక్కితిరిగి చూసుకుంటే.. ఇదంతా ఎలా, ఎప్పుడు, ఎందుకు జరిగిందనిపిస్తోంది. సినిమా రంగంలోకి రావడం ఆనందంగా, గర్వంగా ఉంది.

ఈ జీవితం కోసమే ఎన్నో కలలు కన్నాను. మంచి జీవితం కోసం పరుగులు తీస్తూనే ఉన్నాను. కానీ, సరైన వ్యక్తులు తోడుగా ఉండటం వల్ల ఆలోచించి అడుగులు వేయగలుగుతున్నాను. కలలుకంటూ పెరిగిన నేను సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను. ఇలా లిటిల్‌ గర్ల్‌ తన కలల కోసం ఎదిగింది” అంటూ ఇన్ స్టాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం’పుష్ప2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘ఛావా’, ‘రెయిన్‌బో’ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక.