సెప్టెంబర్‌ 6న ‘ఎమర్జెన్సీ’ విడుదల.. అధికారికంగా ప్రకటించిన కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ సినిమా కొత్త విడుదల తేదీని కంగనా ప్రకటించారు. సెప్టెంబర్‌ 6న ‘ఎమర్జెన్సీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు వెల్లదించారు. ‘ఎమర్జెన్సీ కంగనాకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌. ‘మణికర్ణిక’ తర్వాత ఆమె డైరెక్ట్‌ చేసిన రెండో సినిమా ఇది.

ఈ ప్రాజెక్ట్‌ కోసం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. మొదట ఈ సినిమాను గతేడాది నవంబర్‌ 24న విడుదల చేయాలని భావించారు. ఆతర్వాత జూన్‌ 14కు మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని పనులు పూర్తికావడంతో సెప్టెంబర్‌ 6ను ఫిక్స్‌ చేశారు.

గతంలో ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీనికోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. మొదటి షెడ్యూల్‌ సమయంలో డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కంగనా నిర్మాతగానూ వ్యవహరించారు. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్‌ తల్పడే కనిపించనున్నారు.