టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబుకు అనుకోని షాక్ తగిలింది. ప్రముఖ డెవలపర్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ వ్యాపార వ్యవహారాల్లో మోసపూరిత కార్యకలాపాలు జరిగినట్టు అనుమానంతో, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఆయన విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారానికి సంబంధించి, గత వారం ఈడీ అధికారులు రెండు రోజుల పాటు హైదరాబాద్లోని సంస్థల ఆఫీసులపై దాడులు నిర్వహించారు. ఈ సంస్థ యాజమాన్యం, మహేశ్బాబుకు మొత్తంగా రూ.5.9 కోట్లు చెల్లించినట్టు ఈడీ గుర్తించింది. ఇందులో రూ.3.4 కోట్లు నగదు రూపంలో, రూ.2.5 కోట్లు ఆర్జీఎస్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించినట్టు సమాచారం. సాయి సూర్య డెవలపర్స్ ప్రకటనల్లో మహేశ్ బాబు తన భార్య నమ్రత, పిల్లలతో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసును ఈడీ తీసుకుని విచారణ ప్రారంభించింది. కంపెనీ యజమాని కే సతీశ్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానాపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించడం, ఒకే ప్లాట్ను పలువురికి అమ్మడం, తప్పుదారి పట్టించే ప్రకటనలు వంటి మోసాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి.
మహేశ్ బాబు నేరుగా మోసాల్లో భాగస్వామి కాకపోయినా, ఆయన యాడ్ వలన చాలా మంది పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ భావిస్తోంది. అందుకే ఆయనకు చెల్లించిన రెమ్యునరేషన్పై, డీల్ నేపథ్యంపై ఆరా తీసేందుకు నోటీసులు పంపింది. ఈ పరిణామం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మహేశ్ విచారణకు హాజరవుతారా, లేక లీగల్ టిమ్ ద్వారా సమాధానం ఇస్తారా అనే అంశంపై అభిమానులు ఉత్కంఠగా ఉన్నారు.