జూన్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల

మాస్‌ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని నటించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సిద్ధమైన సంగతి తెలిసిందే. దీని విడుదల తేదీపై రామ్‌ కామెంట్‌ చేశారు. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడే మార్చి 8న విడుదలచేస్తామని వెల్లడించారు. షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేస్తున్నట్లు ఇటీవల తెలిపారు.

తాజాగా రామ్‌ ఈ సీక్వెల్‌ విడుదల వివరాలను తెలిపారు. జూన్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అప్పటికి ఎన్నికల హడావిడి అంతా అయిపోతుందని.. అందుకే వాయిదా వేసినట్లు చెప్పారు. ఎట్టకేలకు రిలీజ్‌పై క్లారిటీ రావడంతో ఆయన ఫ్యాన్స్‌ సంతోషపడుతున్నారు. 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సూపర్‌ హిట్‌ కావడంతో దీన్ని హిందీతో సహా పలుభాషల్లో రీమేక్‌ చేశారు.

అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు డబుల్‌ ఇస్మార్ట్‌ను పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. చార్మి, పూరీ జగన్నాథ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ సీక్వెల్‌ గురించి రామ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సారి వినోదం, యాక్షన్‌ అన్నీ డబుల్‌. విూ అందరికి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి మేం తిరిగి వచ్చేశాం’ అన్నారు.