డైలమాలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రిలీజ్‌

పూరి జగన్నాథ్‌ తాజా చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌. రామ్‌, కావ్య థాపర్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమం విశాఖలో ఘనంగా జరిగింది. విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ చిత్రం నైజాం పంచాయితీ ఇంకా ఎటూ తేలలేదు. కారణం పూరి గత చిత్రం లైగర్‌. విజయ్‌ దేవర కొండా హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ డిజాస్టర్‌ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను భారీ ధర వెచ్చించి నైజాం రైట్స్‌ కొనుగోలు చేసాడు వరంగల్‌ శ్రీను. లైగర్‌ ఫ్లాప్‌ తో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు.

తమకు నష్ట పరిహారం చెల్లించకుండా నైజాంలో డబుల్‌ ఇస్మార్ట్‌ విడుదలను నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించారు. కొందరు ఈ విడుదలను బహిష్కరించాలని కూడా నిర్ణయించుకున్నారు.దీంతో డబుల్‌ ఇస్మార్ట్‌ రిలీజ్‌ డైలమాలో పడింది.

ఇటీవల ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం భేటీల మీద భేటీలు జరిగాయి కానీ ఎటు తేలలేదు. ఫైనల్‌ గా ఈ వ్యవ్యరంలోకి నైజాం టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌, ఫైనాన్షియర్‌ మరియు నిర్మాత ఏషియన్‌ సునీల్‌ రంగంలోకి దిగారు. లైగర్‌ ను కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీనుకు అలాగే ఎగ్జిబిటర్లకు ఏషియన్‌ సునీల్‌ కొంత మొత్తం నష్టపరిహారం చెల్లించి, ఏషియన్‌ సునీల్‌ నిర్మాణంలో పూరి జగన్నాథ్‌ ఓ సినిమా చేసేలా ఒప్పందం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు ఇరు పక్షాలు అంగీకరించారని సమాచారం అందుతోంది. మరోవైపు డబుల్‌ ఇస్మార్ట్‌ ఇండియా థియేట్రికల్‌ రైట్స్‌ ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మాత నిరంజన్‌ రెడ్డి రూ. 60 కోట్లకు కొనుగోలు చేసారు. ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌ గా రిలీజ్‌ కానుంది డబుల్‌ ఇస్మార్ట్‌.