నా కూతురిని ఆమెతో పోల్చకండి… మీడియా ప్రతినిధి పై ఫైర్ అయిన బోని కపూర్?

అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారంటూ ఉండరు. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ గా మారిన జాన్వి కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం “మిలీ” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘హెలెన్’ సినిమాకి రీమేక్ గా హిందీలో ఈ సినిమాని తెరకెక్కించారు. మలయాళీ సినిమాకు దర్శకత్వం వహించినకి మత్తుకుట్టి జేవియర్ హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాన్వీ కపూర్ తండ్రి బోనికపూర్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా జాన్వి కపూర్ ఆమె తండ్రి బోనికపూర్ మీడియాతో ముచ్చటిస్తూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ మీడియా విలేకరి జాన్వీ కపూర్‌ను శ్రీదేవితో పోల్చడంతో బోనీకపూర్ స్పందిస్తూ..నా బిడ్డను ఆమె తల్లి శ్రీదేవితో పోల్చవద్దంటూ చెప్పుకొచ్చాడు. బోనీ కపూర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ..’ప్రతిఒక్కరూ తమ పాత్రను అర్థం చేసుకోవడానికి విభిన్నమైన మార్గాలను అనుసరిస్తూ ఉంటారు.

అటువంటి వారిలో శ్రీదేవి ఒకరు. బాలనటిగా తన కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి నాట్ ఇండస్ట్రీలో దాదాపు 200కు పైగా సినిమాలలో నటించింది. ఇలా నార్త్, సౌత్ అని తేడా లేకుండా కొన్ని వందల సినిమాలలో నటించిన శ్రీదేవి తన నటన జీవితంలో అగ్రస్థానానికి చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది. కానీ నా కూతురు జాన్వి కపూర్ ఇప్పుడిప్పుడే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శ్రీదేవి లాగే జాన్వీ కూడా భిన్న పాత్రలే ఎంచుకుంటోంది. దయచేసి నా కూతురిని ఆమె తల్లితో పోల్చకండి’ అంటూ మీడియా ప్రతినిధులను కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.