సీక్వెల్‌కు ‘ఈగ’ ఉంటే చాలు… నానితో దర్శకుడు రాజమౌళి సరదా కామెంట్‌

విజువల్‌ వండర్‌ అనే పదానికి టాలీవుడ్‌లో అసలైన అర్థం చెప్పిన చిత్రం ‘ఈగ’. పెద్ద హీరోలతోనే కాదు.. చిన్న ‘ఈగ’తోనూ సినిమా తీసి బాక్సాఫీసు దగ్గర రికార్డులు సృష్టించొచ్చని నిరూపించారు దర్శకుడు రాజమౌళి.

తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజమౌళికి తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను పంచుకున్నారు. ‘నేను విజయేంద్ర ప్రసాద్‌ సర్‌ని ఎప్పుడూ ‘ఈగ’ సీక్వెల్‌ గురించి అడగలేదు. కానీ, రాజమౌళితో దీని గురించి సరదాగా చర్చించాను. ‘ఈగ 2’ చేస్తానన్నారు కదా.. ఇది ఎప్పుడు మొదలుపెడదామని అడిగాను. అప్పుడు దానికి ఆయన.. ‘మేము ‘ఈగ 2’ చేసినా నీతో అవసరం లేదు. ఈగ ఉంటే చాలు. అదే సీక్వెల్‌లో తిరిగి వస్తుంది‘ అని చెప్పారు.

‘ఈగ’ సినిమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజమౌళి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆయనకు దీని సీక్వెల్‌ గురించి ఆలోచన వచ్చినప్పుడు కచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నా. అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు‘ అంటూ దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు.

నాని, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఈగ’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది. సుదీప్‌ విలనిజం ఎంతగానో ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ సినిమా 2 జాతీయ అవార్డులు, 3 సైమా అవార్డులు, 5 సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.