విజయభాస్కర్‌ దర్శకత్వంలో ‘ఉషా పరిణయం’

నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తాజాగా మరో లవ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రాబోతుంది. ‘ఉషా పరిణయం’ అనే బ్యూటిఫుల్‌ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో శ్రీకమల్‌, తన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ … సాయి ద రియల్‌హీరో.. సాయి దుర్గ తేజ్‌ హీరోగానే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తాడు. పద్నాలుగేళ్ల తరువాత సాయిను చూస్తున్నాను. సాయిని 14 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌ గారి నిర్మాణ సారథ్యంలో నేనే హీరోగా ఇంట్రడ్యూస్‌ చేయాలి కానీ కుదరలేదు. ఆ రోజు ఎంత వినయంగా, సంస్కారంతో ఉన్నాడో.. ఈ రోజు అలాగే ఉన్నాడు, చిరంజీవి గారి దగ్గర ఉన్న ప్రేమ సాయిలో కనిపించింది. మా టీమ్‌ను ఎంకరైజ్‌ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రానికి ధ్రువన్‌ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. సతీష్‌ ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యింది. తన్వీ చాలా కంఫర్టబుల్‌ హీరోయిన్‌. కాశ్మీర్‌లో ఎంత ఇబ్బందైనా అంత చలిలో కూడా ఎంతో సహకరించింది. సినిమాలో టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌ కూడా ఎంతో ఓన్‌ చేసుకుని ఈ సినిమా చేశారు’ అన్నారు.

హీరో శ్రీకమల్‌ మాట్లాడుతూ.. అందరి పూర్తి సహకారంతో ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. అనుకున్న టైమ్‌ కంటే ముందే షూటింగ్‌ను పూర్తిచేశాం. సాయి దుర్గ తేజ్‌కు నేను అభిమానిని. ఆయన రావడం ఎంతో మధురానుభూతి. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూసి మమ్ములను ఎంకరైజ్‌ చేయాలని కోరుకుంటున్నాను. నాన్న గారి పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. తాన్వీ ఆకాంక్ష.. చాలా మంచిగా పెంచారు. చాలా కంఫర్టబుల్‌ నో ప్రాబ్లమ్‌ గర్ల్‌. ఆమెతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నాను. మా చెల్లి, బావ ఈ సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారు. అందరికి సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.