రాముడి పాత్రధారికి ప్రశాంత చిత్తం అవసరం!

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ పేరుతో ఇది రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌ రాముడిగా కనిపించనున్నారు. అయితే, రాముడిగా ఈ హీరోనే ఎంపిక చేసుకోవడంపై తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు ముఖేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాముడి పాత్ర పోషించాల్సినవారికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ప్రశాంతత. రణ్‌బీర్‌ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. అందుకే నితేశ్‌ తివారీ అందరికంటే అతడిని ముందుగా ఎంపిక చేశారు. రాముడిగా రణ్‌బీర్‌ ఎంపిక సరైనదని సినిమా చూశాక ప్రేక్షకులకు కచ్చితంగా అర్థమవుతుంది. నేను రణ్‌బీర్‌తో కలిసి చాలా ప్రాజెక్ట్‌లకు వర్క్‌ చేశాను. నటనలో ఆయనతో ఎవరూ పోటీ పడలేరు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటాడు’ అంటూ రణ్‌బీర్‌పై ముఖేశ్‌ ప్రశంసలు కురిపించారు.

ఇందులో అగ్రనటీనటులు భాగం కానున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సీతగా సాయి పల్లవి , రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మొదటి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీతో సంప్రదింపులు జరిపిందట. ఈ సినిమాకు తెలుగు వెర్షన్‌ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కు అప్పగించినట్లు సమాచారం.