ఆచార్య నుండి స‌ర్‌ప్రైజ్ వీడియో షేర్ చేసిన చిరంజీవి.. కొద్ది క్ష‌ణాల్లోనే వైర‌ల్

లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోకి అడుగుపెట్టిన మెగా స్టార్ చిరంజీవి త‌న సినిమాల విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాలు స‌మాజంలో జ‌ర‌గుతున్న మంచి చెడుల గురించి త‌న‌దైన శైలిలో స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న త‌న క‌న్నా పెద్ద స్థాయికి వెళ్లిన కూతురిని చూసి మురిసిపోతున్న తండ్రికి సంబంధించిన విష‌యాల‌ను ట్విట్టర్ ద్వారా తెలియ‌జేస్తూ ఆయ‌నకు సెల్యూట్ చేసిన చిరంజీవి తాజాగా త‌ను న‌టిస్తున్న ఆచార్య సినిమా కోసం వేసిన భారీ సెట్‌కు సంబంధించిన వీడియోని షేర్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఆచార్య కోసం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌ని త‌న కెమెరాలో బంధించిన చిరంజీవి ఆ వీడియో ద్వారా దాని ప్ర‌త్యేక‌త‌ను తెలియ‌జేస్తూ, ఈ సెట్ ఇంత అద్భుతంగా రూపొందించిన ఆర్ట్ డైరెక్ట‌ర్ సురేష్‌, విజువ‌లైజేష‌న్ డైరెక్ట‌ర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ‘ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్‌ టౌన్‌ సెట్ వేశారు. దీనిని 20 ఎకరాల విస్తీర్ణంలో పున‌రుద్ధ‌రించ‌డం జ‌రిగింది. అందులో భాగంగా గాలి గోపురం, ఆశ్చర్యంగొలిపేలా ప్రతి చిన్న చిన్న డిటేల్స్‌ని అద్భుతంగా మలిచారు. ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఒక మచ్చుతునక. నాకెంతో ముచ్చనటిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనుకున్నాను.

మ‌నం నిజంగానే ఒక టెంపుల్‌ టౌన్‌లో ఉన్నామా అనేంతగా ఈ సెట్‌ని నిర్మించిన కళా దర్శకుడు సురేష్‌, ఈ టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన డైరెక్టర్ కొరటాల శివని, దీన్ని ఇంత అపురూపంగా నిర్మించడానికి అవసరమైన వనరులను ఇచ్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్‌ చరణ్ లను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేక్షకులకు కూడా ఈ టెంపుల్ టౌన్ ఒక ఆనందానుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు’ అని చిరంజీవి త‌న వీడియోలో తెలియ‌జేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రాన్ని నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక‌గా నటిస్తున్నారు. సోనూసూద్ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.