Re Release Movies: క్లాసిక్ రీ రిలీజ్‌లకు కొత్త మానిటరింగ్ అవసరమా?

రీసెంట్‌గా రీ రిలీజ్‌ల హవా తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో, వింటేజ్ సినిమాలకు థియేటర్లలో ఊహించని స్పందన లభిస్తోంది. తాజాగా జగదేకవీరుడు అతిలోకసుందరికి వచ్చిన గ్రాండ్ వెల్కమ్ చూసి సినీ పరిశ్రమ ఆశ్చర్యానికి గురయింది. కొత్త సినిమాలకీ కంటే బెటర్ అనే రీతిలో కొన్ని సెంటర్లలో కలెక్షన్లు వచ్చినా, ప్రేక్షకులలో నాణ్యతపై నిరాశ మిగిలినట్లుగా స్పష్టమవుతోంది.

ప్రింట్ క్వాలిటీ సమస్యలు ఇప్పుడు రీ రిలీజ్‌లకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. పాత రీళ్ళను భద్రపరచకపోవడం, లభించినవీ డ్యామేజ్ కావడం వంటివి నిర్మాతల చేతుల్ని కాల్చేస్తున్నాయి. ఇదే సమస్య గతంలో ఆదిత్య 369 రీ రిలీజ్‌లోనూ తారసపడింది. కలర్ గ్రేడింగ్, రీస్టోరేషన్ సరిగా చేయలేని పరిస్థితి, ప్రేక్షకుల అనుభూతిని తగ్గిస్తోందని చెప్పకనే చెప్పింది.

ఇప్పుడు పరిశ్రమలో మాట్లాడుకునే ముఖ్యమైన అంశం.. కేవలం సినిమాను తిరిగి విడుదల చేయడమే కాదు, దానికి తగిన ప్రామాణికతను అందించడం. హాలీవుడ్, బాలీవుడ్ తాలూకు రీ స్టోరేషన్లను చూసి మన పరిశ్రమ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4కె స్కాన్‌లా ఒకసారి స్టాండర్డ్ ప్రింట్ తయారు చేస్తే, భవిష్యత్తులో మరిన్ని స్క్రీనింగులకు అదే ఉపయోగపడుతుంది.

ప్రేక్షకులు ఎదురుచూస్తున్నా మరిన్ని క్లాసిక్స్ ఉన్నాయి.. శివ, బొబ్బిలి రాజా, హలో బ్రదర్, సాగర సంగమం లాంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొదమసింహం ఇప్పటికే రీ రిలీజ్‌కు సన్నద్ధమవుతోంది. కానీ, ఇప్పుడు నుంచి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రింట్ ప్రామాణికతను పెంచే పనే మొదలు పెట్టాలి.

మొత్తానికి చెప్పాలంటే, నోస్టలిజియా ఫీలింగ్ మీద మాత్రమే ఆడే రోజులు పోయాయి. ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసం వస్తున్నారు, కాబట్టి క్వాలిటీపై కాంప్రమైజ్ చేయకూడదన్నది పరిశ్రమ గమనించాల్సిన గుణపాఠం. రీ రిలీజ్‌లను ఒక వాణిజ్య అవకాశమే కాకుండా, ఒక గొప్ప సాంకేతిక ప్రదర్శనగానూ మారుస్తేనే దీర్ఘకాలపు విజయాన్ని అందుకోగలమని అర్థం అవుతోంది.

కష్టాలు నష్టాలు కన్నీళ్లు | Transgender Shashirekha Struggle Life | Telugu Rajyam