మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ కూడా అంతేనా.?

ఈ మధ్య ఏ పెద్ద ప్రాజెక్ట్ గురించిన డిస్కషన్స్ వచ్చినా, ‘ఎన్ని భాగాలు.?’ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘దేవర’ విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం. ‘పుష్ప’ విషయంలో ఏం జరుగుతోందో చూస్తూనే వున్నాం.!

చిన్న సినిమాలు సైతం మొదటి భాగం, రెండో భాగం.. అంటున్నాయ్.! వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ‘బింబిసార’ కూడా పలు భాగాలతో వుంటుందనే ప్రచారం జరిగింది. ‘బింబిసార’ తర్వాత దాని కొనసాగింపుపై సౌండ్ లేదు.

సినిమా హిట్టయినా కొనసాగింపుపై ఈ సస్పెన్స్ ఎందుకో ఏమో.! ఫ్లాప్ బాట పట్టిన సినిమాలకైతే కొనసాగింపు అవకాశమే లేకుండా పోతోంది. ఇంతకీ, ‘విశ్వంభర’ సంగతేంటట.?

మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. త్రిష సహా ఓ నలుగురైదుగురు అందాల భామలు ఈ సినిమాలో నటించబోతున్నారు. సినిమా షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంతలోనే, ఈ ప్రాజెక్టు ఎన్ని పార్టులు.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది.

ముందైతే, ఒకే భాగం అనుకున్నారుగానీ, షూటింగ్ ప్రారంభమైతే.. పార్టులు పార్టులుగా విడుదల చేయడమే బెటర్.. అనే నిర్ణయానికి వచ్చారన్నది తాజా ఖబర్. చిరంజీవి కూడా, దర్శకుడి ఆలోచనకి ఓకే చెప్పారని తెలుస్తోంది.

‘విశ్వంభర’ వెండితెరపై ఓ అద్భుతం అవుతుందనీ, చిరంజీవి కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్ మూవీ అయిన, ‘అంజి’ తరహాలో విజువల్ ఎఫెక్ట్స్ వుంటాయనీ అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మీదనే కనీ వినీ ఎరుగని స్థాయిలో ఖర్చు పెట్టబోతున్నారట.