చిరంజీవి మేకోవర్ ఈ సారి బాలీవుడ్ నుంచి.!

‘ఆచార్య’ డిజాస్టరే మెగాస్టార్ చిరంజీవిని ఢీలా పడేసిందంటే, ‘వాల్తేర్ వీరయ్య’ సూపర్ హిట్ ఆయన స్థానం వేరు, ఆ స్థాయి వేరు.. అనేంతలా ఆయన స్థాయిని శిఖరంలా నిలబెట్టేసింది.

ఇప్పుడు ‘భోళా శంకర్’ డిజాస్టర్ మాత్రం చిరంజీవిలో చాలా మార్పులు తీసుకొచ్చిందంటున్నారు. తప్పదు బాస్ మారాల్సిందే.. అనే ఒత్తడి పెరగడంతో ఇక చిరంజీవి కూడా మార్పు మంచిదే అని భావిస్తున్నారట.

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంతవరకూ చిరంజీవి ఓ స్పెషల్ టీమ్‌ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ టీమ్‌పై కొన్ని రకాల అనుమానాలతో కూడిన గాసిప్స్ క్రియేట్ చేశారు కొంతమంది. ఆ అనుమానాలు పటాపంచలు చేసే పనిలో ఆయన బిజీగా వున్నారు. అలాగే, మేకోవర్ విషయంలోనూ చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ సారి లోకల్ టీమ్‌ని పక్కన పెట్టేసి ఆయన మేకప్ కోసం బాలీవుడ్ నుంచి స్పెషల్ టీమ్‌ని దించబోతున్నారట. లుక్స్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ వరకూ ఇప్పటిదాకా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితనే చూసుకుంది.

ఇక తదుపరి సినిమాలకు మాత్రం బాలీవుడ్ మేకప్ అసిస్టెంట్స్‌ని దించబోతున్నారట. మెగా 157 నుంచే ఈ మార్పును అమలు చేయబోతున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ కొత్త మార్పులతో చిరంజీవి ఇంకెంత యంగ్‌గా కనిపించబోతున్నారో.!