పరశురాం సెటిల్‌మెంట్‌లో బిగ్ ట్విస్ట్

కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సెటిల్‌మెంట్ అనే అంశం బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్లకు సంబంధించిన వ్యవహారంతో ఇది మరింత హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్‌లోని పేరున్న ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఆయన అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు చేయడం లేదని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా పరశురాం పెట్ల 14 రీల్స్ బ్యానర్‌లో నాగ చైతన్య లేదా తమిళ స్టార్ కార్తీతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడని గతంలోనే చెప్పుకున్నాం. కానీ, ఈ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో అతడు దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ దేవరకొండతో సినిమాను ప్రకటించినట్లు టాక్ వచ్చింది. దీంతో 14 రీల్స్ సంస్థ పరశురాం పెట్ల తీరుపై కోపంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

14 రీల్స్ నుంచి తప్పుకోవడంతో పరశురాం ఆ సంస్థకు ఏకంగా రూ. 14.50 కోట్లు వరకూ తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని, ఆ మొత్తాన్ని ఇటీవలే సెటిల్ చేశాడని వార్తలు వైరల్ కూడా అయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ డైరెక్టర్ ఏ నిర్మాణ సంస్థతో ఎలాంటి సెటిల్‌మెంట్‌ చేసుకోలేదని తెలిసింది. అంటే.. ఇటీవల వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని స్ఫష్టం అయిపోయింది.

పరశురాం పెట్ల సెటిల్‌మెంట్ వ్యవహారంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ఆయన సెటిల్‌మెంట్ చేస్తున్నాడని, ఇందుకోసం కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగినట్లు ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది మాత్రం దిల్ రాజు – విజయ్ దేవరకొండ సినిమాకు ఆటంకం ఏర్పడకుండా చేస్తున్న ప్రచారంలో భాగమేనని టాక్ వినిపిస్తోంది. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

అసలు విజయ్ దేవరకొండ సినిమాకు, 14 రీల్స్‌ గొడవకు లింక్ ఏర్పడడానికి కూడా పరశురామే కారణం. తమ సంస్థకు సెటిల్ చేయాల్సిన మొత్తానికి బదులుగా.. విజయ్ సినిమాలో భాగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. దీని నుంచి తప్పించుకోవడం కోసమే డైరెక్టర్ పరశురాం పెట్ల సెటిల్‌మెంట్ అంటూ హడావిడి చేస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.