బాలకృష్ణ సరసన ముగ్గరు హీరోయిన్లు!?

స్టార్‌ హీరో బాలకృష్ణకు ఉన్న ఫాలోయింగ్‌ అంతాఇంతా కాదు. ఆయన సినిమాల గురించి ఏ అప్‌డేట్స్‌ వచ్చినా అవి క్షణాల్లో వైరల్‌గా మారతాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య పేరు సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు తెగ షేర్‌ అవుతున్నాయి. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా (ఎన్‌బికె109) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఊర్వశీ రౌతేలా, ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్దా శ్రీనాథ్‌ ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇదే నిజమైతే బాలయ్య సరసన ప్రగ్యాలను తెరపై రెండోసారి చూడొచ్చని అభిమానులు అనుకుంటున్నారు. ఇందులో బాబీడియోల్ విలన్‌గా కనిపించ నున్నారు.

మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన క్లాసీ లుక్‌లో కనిపించనున్నారట. అలాగే దీనిలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యం ఉంటుందని టాక్‌. ఈ ఏడాది సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రాల్లో ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ’ఆవేశం’ ఒకటి.

జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. కేవలం రూ.30 కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్లు వసూలుచేసింది. ఇప్పుడీ చిత్రాన్ని బాలకృష్ణ రీమేక్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హక్కులను కూడా టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.