నిండు మనస్సుతో క్షమాపణలు అడుగుతున్నా : సుమ

యాంకర్‌ సుమ ఈ పేరు తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ సుమ ఎవరు..? అని అడగ్గా టక్కున చెప్పేస్తారు. సుమ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో గడగడా మాట్లాడుతూ.. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటుంది. ఏ సినిమా ఈవెంట్‌, షో అయినా వ్యాఖ్యాతగా సుమ ఉండాల్సిందే. కొందరు దర్శక నిర్మాతలు సుమ డేట్స్‌ కోసం తమ ఈవెంట్స్‌ను కూడా పోస్ట్‌ పోన్‌ చేసుకుంటుంటారు. అంతటి గుర్తింపు తెచ్చుకున్న సుమ.. తాజాగా విూడియాను క్షమాపణలు కోరింది.

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాలోని ‘లీలమ్మో’ పాట విడుదల వేడుకను చిత్ర బృందం హైదాబాద్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా విూడియాపై నోరు పారేసుకున్నారు. ‘విూడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఓ విలేకరు సీరియస్‌గా తీసుకున్నారు. విూడియా వారిని అలా అనకుండా ఉండాల్సింది అని సుమ ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దీంతో సుమ స్పందిస్తూ.. ‘విూడియా వారంతా నాతో చాలాకాలంగా కలిసి ప్రయాణిస్తున్నారు. ఆ చనువుతోనే అలా అన్నాను’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ‘విూరు స్నాక్స్‌ను స్నాక్స్‌లానే తిన్నారు.. ఓకేనా’ అంటూ సదరు విలేకరుని కూల్‌ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆతడు మరోసారి అసహనానికి గురయ్యారు. ‘ఇదే వద్దనేని. విూ యాంకరింగ్‌ అందరికీ ఇష్టమే. మాకు కూడా నచ్చుతుంది. అయితే, విూడియా విషయంలో ఇలాంటివి వద్దు’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. వెంటనే సుమ అక్కడే విలేకరులకు క్షమాపణలు చెప్పారు.

ఇప్పుడు తాజాగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘విూడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా. విూరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. విూరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.