‘మంగళవారం’తో అజయ్‌భూపతి ఖాతాలో మరో హిట్‌?

దర్శకుడు అజయ్‌ భూపతి ‘ఆర్‌ఎక్స్‌ 100’ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. అందులో కార్తికేయ, పాయల్‌ రాజపుట్‌ జంటగా నటించారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది, విడుదలై ఐదేళ్లు అయింది. మొదటి సినిమా తోటే అందరి కళ్ళల్లో పడ్డ అజయ్‌ భూపతి రెండో సినిమా రావటానికి చాలా కాలం తీసుకున్నాడు. ‘మహాసముద్రం’అనే సినిమా చేసాడు, శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులు, కానీ సినిమా ఫ్లాప్‌ అయింది. మూడో సినిమా ఇప్పుడు ‘మంగళవారం’ విడుదలకి సిద్ధంగా వుంది. అజయ్‌ భూపతి ఒక సెన్సిబుల్‌ దర్శకుడు, మంచి సాంకేతికనిపుణుడు, టాలెంట్‌ వున్న దర్శకుడు, ఈ ఐదేళ్లలో మూడు సినిమాలే చేసిన అతనికి ఇప్పుడు ఒక మంచి బ్రేక్‌ కావాలి.

అది ఈ ‘మంగళవారం’తో మళ్ళీ కొడతాడు అని అంటున్నారు. ఎందుకంటే అజయ్‌ భూపతి ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు, తీస్తున్నాడు అంటే అంతగా ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఈ సినిమా టీజర్‌, పాట, ట్రైలర్‌ విడుదలయ్యాక, ఈ సినిమాలో విషయం వుంది అని అర్థం అవుతోంది. అందుకే ‘మంగళవారం’ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ట్రైలర్‌ చూసి చాలామంది, సినిమా హిట్‌ అవుతుందని చెప్పారు, అలాగే ఈ ‘మంగళవారం’ ట్రైలర్‌ చూసి, ఈ సినిమా మంచి హిట్‌ అవుతుందని చెపుతున్నారు.

ఇందులో మళ్ళీ పాయల్‌ రాజపుట్‌ కథానాయికగా నటిస్తోంది, అలాగే చాలామంది కొత్తవాళ్ళని తీసుకున్నాడు అజయ్‌. సినిమాలో విషయం వుండాలే కానీ, కొత్త, పాత ఎవరైనా ఒకటే. అయితే తెలుగు నటుల్ని చాలామందిని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాడు అజయ్‌ అని అంటున్నారు. ఈ సినిమా గురించి అజయ్‌ ట్రైలర్‌ విడుదల అప్పుడు చెప్పాడు.

‘‘ఇది ఒక డార్క్‌ థ్రిల్లర్‌ ఇది. డిఫరెంట్‌ జానర్‌ సినిమా తీశా. ఈ సినిమా గురించి అంతకు మించి ఏవిూ చెప్పలేను. అందులోనూ ఈ తరహా విలేజ్‌ మరియు నేటివిటీతో కూడిన డార్క్‌ థ్రిల్లర్‌ తీయడం ఇంకా కష్టం. షూటింగ్‌ చేసేటప్పుడు ఎడిటింగ్‌, సౌండ్‌ మనసులో ఉండాలి. ఫుల్‌ స్క్రిప్ట్‌ పట్టుకుని షూటింగ్‌ చేయాలి. ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ టచ్‌ చేశా,’’ అని చెప్పాడు అజయ్‌ సినిమా గురించి.

ఈ సినిమాకి ఆ టైటిల్‌ ఎందుకు పెట్టాడో కూడా వివరణ ఇచ్చాడు అజయ్‌. ‘మంగళవారం’ టైటిల్‌ వెనుక కారణం ఉంది. అది సినిమా చూస్తే తెలుస్తుంది. దేవతలకు ఇష్టమైన రోజు మంగళవారం. దానిని జయవారం అని కూడా అంటారు. ఎవరో కొందరు పిచ్చ పిచ్చ సామెతలు చెబుతారు. వాటిని పట్టించుకోవద్దు అని చెప్పాడు అజయ్‌.

ప్రముఖ వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ కుమార్తె స్వాతి రెడ్డి ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమాలో మహిళలకు సంబంధించిన పాయింట్‌ ఒకటి టచ్‌ చేశాం. అది నచ్చి స్వాతి సినిమా చేస్తానని అన్నారని చెప్పాడు అజయ్‌.

షూటింగ్‌ అంతా అవుటాఫ్‌ హైదరాబాద్‌ చేశా. ఇప్పుడు ఈ ట్రైలర్‌ చూసి ఈ సినిమా వ్యాపారం కూడా చాలా డిమాండ్‌ వుంది. ఆంధ్ర, సీడెడ్‌, నిజాం ఏరియా హక్కుల కోసం చాలామంది పోటీ పడుతున్నట్టుగా పరిశ్రమలో టాక్‌ నడుస్తోంది. ఆంధ్ర, సీడెడ్‌ ఏరియా హక్కులు అప్పుడే తీసేసుకున్నారని కూడా టాక్‌ నడుస్తోంది. చాలా ఎక్కువ డబ్బులకే అమ్మారని కూడా టాక్‌ నడుస్తోంది. ఈ సినిమాతో అజయ్‌ భూపతి మళ్ళీ హిట్‌ కొట్టడం ఖాయం అని కూడా అంటున్నారు.