2 స్టేట్స్ రీమేక్.. లీగల్ సమస్యలో అడివిశేష్!

యువ హీరో అడివి శేష్ గత కొంతకాలంగా డిఫరెంట్ సినిమాలతో వారుసగా విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన కథలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే సడన్ అతను లీగల్ సమస్యల్లో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది. ఒక రీమేక్ సినిమాను మొదలు పెట్టి సడన్ గా తప్పుకోవడంతో ఆయనపై పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన 2 స్టేట్స్ ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రీమేక్ లో యువ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తుండగా రాజశేఖర్ – జీవితల కూతురు శివానీ హీరోయిన్ గా నటిస్తోంది. గత ఏడాది కొంత షూటింగ్ కూడా పూర్తి చేశారు. అయితే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయిందట. సినిమా ఆగిపోయినప్పటి నుంచి కూడా ప్రాజెక్ట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న ఎంఎల్‌వి సత్యనారాయణ హీరో అడివి శేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పూర్తి చేసేందుకు అడివి శేష్ సహకరీంచడం లేదని అలాగే సడన్ గా సినిమా సగంలో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే అగ్రిమెంట్ ను ఫాలో కాలేదని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారట నిర్మాత. ప్రాజెక్ట్ సగంలోనే ఆగిపోవడం వలన రానున్న రోజుల్లో నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. అదే విధంగా ఒప్పందాన్ని లెక్క చేయనందు వల్ల అడివి శేష్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్మాత కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.