‘రాజా రాణి’కి పదేళ్లు.. నయనతార ఫ్రౌడ్‌ ఫీలింగ్‌!!

ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’తో నేషనల్‌ వైడ్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందించిన దర్శకుడు అట్లీ ప్రయాణం 2013లో ‘రాజా రాణి’ సినిమాతో మొదలైంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దగ్గర ‘ఎంథిరన్‌’ (రోబో), ‘నన్‌బన్‌’ (స్నేహితుడు) సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అట్లీ.. రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘రాజా రాణి’తో మెగాఫోన్‌ పట్టుకున్నాడు.

2013లో ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుమారు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపుగా వంద కోట్ల వసూళ్లు చేసింది. ఆర్య, జై, నయనతార, నజ్రియా ప్రధాన పాత్రలు పోషించి ఈ చిత్రం ముఖ్యంగా యువతని అలరించింది. ఈ సినిమా తర్వాత అట్లీ మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేదు.

ఇప్పుడీ సినిమాకి పదేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తనని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ ని షేర్‌ చేశారు అట్లీ. ఈ పోస్ట్‌ పై హీరోయిన్‌ నయనతార తన అనందం వ్యక్తం చేసింది. ‘’అట్లీ.. ప్రౌడ్‌ అఫ్‌ యూ’’అంటూ అట్లీ పోస్ట్‌ని తన హ్యాండిల్‌లో షేర్‌ చేసింది. ‘రాజా రాణి’ తర్వాత అట్లీ దర్శకత్వం వహించిన బిగిల్‌, జవాన్‌ చిత్రాలలో నటించారు నయనతార.