“కళ్యాణం కమనీయం” : ప్రియ భవాని శంకర్

“కళ్యాణం కమనీయం” సంక్రాంతికి విడుదలయ్యే కుటుంబ కథా చిత్రం. కొత్తగా పెళ్లయిన ఇద్దరి జంట మధ్య సాగే ఈ న్యూ-ఏజ్ ఫామిలీ డ్రామాలో సంతోష్ శోభన్ హీరోగా నటించగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

యువి కాన్సెప్ట్ నిర్మించిన ఈ చిత్రంతో అనిల్ కుమార్ ఆళ్ళ ని దర్శకుడిగా పరిచయం చేశారు.

తన తొలి తెలుగు సినిమా సంక్రాంతి కి రిలీజ్ ఉండడంతో మీడియాతో మాట్లాడారు ప్రియా భవాని శంకర్…

“తమిళ్ లో నేను చాలా మంచి చిత్రాలు చేసాను. యువి లాంటి పెద్ద బ్యానర్ తో తెలుగు లో లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజ జీవితానికి దగ్గరగా హృద్యంగా ఉండే చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక మంచి కథతో తెరకెక్కిన “కళ్యాణం కమనీయం”లో ఒక ముఖ్యమైన భాగమయినందుకు, ఒక మంచి టీమ్ తో పని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

ప్రతి ఒక్కరు నాకు చాలా సహాయంగా ఉన్నారు. నాకు సెట్స్ లో ప్రామ్ప్టింగ్ నచ్చదు, సంతోష్ శోభన్ నాకు డైలాగ్స్ లో సహాయం చేసారు. సంతోష్ అద్భుతమైన నటుడు. పేరొందిన దర్శకులు శోభన్ గారి కొడుకు అయినా కూడా తను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కస్టపడి ఎదిగాడు.

ఇగో సమస్యలు లేని ఒక భార్య భర్త మధ్య జరిగిన సంఘటనలు, వాటితో కూడిన సన్నివేశాలతో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. పనిలేని భర్త శివ, ఉద్యోగానికెళ్ళే భార్య శృతి, ఇద్దరి మధ్య చుట్టూ ఉన్నవాళ్ళ మాటలు, అభిప్రాయాల వల్ల మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్ళింది అన్నదే కథాంశం.

శృతి పాత్రకి నాకు దాదాపు 90 % పోలికలున్నాయి. అలా ఆ పాత్ర పోషించడంలో నాకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. తమిళ్ లో నా మొదటి చిత్రానికి నాకు పెద్దగా ఆలోచన లేమి లేవు. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరిస్తారో అనే ఆందోళన ఇప్పుడుంది.

ఎవరిని వాళ్ళు ఆ పరిస్థితుల్లో పోల్చుకునేలా కథ, మాటలు, పాత్రలు రాసారు అనిల్ కుమార్ ఆళ్ళ. శృతి పాత్రలో మీ చెల్లెళ్ళు, అమ్మలు, కూతుర్లు అందరూ తమని తాము చూసుకుంటారు. అనిల్ లాంటి చాల మంది కొత్త దర్శకులతో నేను పని చేసాను. దర్శకుడికి కథ పై పూర్తి పట్టుండాలి అనుకుంటాను నేను. యువి లాంటి పెద్ద సంస్థ ఈ కథ నిర్మాణానికి సిద్దమైనపుడు నాకు అనిల్ మీద పూర్తి నమ్మకం వచ్చింది.

శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన సంగీతం అందించడంతో పాటలు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసాయి. నిర్మాణ విలువల్లో కూడా యువి ఎక్కడా తగ్గలేదు.

ఈ సంవత్సరంలో నాగ చైతన్య తో ‘దూత’, సత్యదేవ్ 26 వ చిత్రంలో నటించనున్నాను, అలాగే కొత్త కథలు కూడా వింటున్నాను అంటూ ముగించారు.