‘యశోద’ దర్శకులు హరి, హరీష్ ఇంటర్వ్యూ..

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు. వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ…

మీరు తమిళంలో ‘ఒరు ఇరవు’, ‘అంబులి’, ‘ఆ’, ‘జంబులింగం’ సినిమాలు తీశారు. ఐడియాస్, మేకింగ్ పరంగా కొత్తగా ఉంటాయి. ఎక్స్‌పరిమెంట్స్ కూడా! స్కేల్ పరంగా చూస్తే ‘యశోద’ పెద్ద సినిమా. దీని గురించి చెప్పండి!

స్కేల్ పరంగా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఛాలెంజ్ పరంగా అయితే సేమ్. మా తొలి సినిమా ‘ఒరు ఇరవు’లో హీరో హీరోయిన్లు ఉండరు. చూసే ప్రేక్షకులే హీరో. అది పాయింట్ ఆఫ్ మూవీ కావడంతో డిఫరెంట్ ఛాలెంజ్ ఫేస్ చేశాం. హరీష్ ఫాదర్ ఆ సినిమాకు నిర్మాత. ‘యశోద’కు వస్తే భారీ స్కేల్‌లో చేశాం. కంటెంట్ పరంగా ఛాలెంజెస్ ఈ సినిమాకూ ఉన్నాయి. కథ పరంగా ఎప్పుడూ కొత్త పాయింట్ చెప్పాలనేది మా ఉద్దేశం. కంటెంట్ ఎలా చెబుతున్నామనేది ముఖ్యం. ఇటువంటి కథకు అంత బడ్జెట్ అవసరం కూడా! సమంత, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

ఈ సినిమాను మూడు నాలుగు కోట్లలో తీయాలనుకుంటే… బడ్జెట్ పెంచానని నిర్మాత చెప్పారు! రిస్క్ అనిపించలేదా?

తక్కువ నిర్మాణ వ్యయంలో సినిమా తీసేలా ఒక వెర్షన్ రెడీ చేశాం. మేం స్క్రిప్ట్ రాసేటప్పుడు సమంత గారిని దృష్టిలో పెట్టుకుని రాశాం. ఆవిడతో చేస్తామో? లేదో? తెలియదు. అందుకని. తక్కువ బడ్జెట్‌లో చేసేలా రాసుకున్నాం. శివలెంక కృష్ణప్రసాద్ గారికి చెప్పినప్పుడు ‘భారీ స్థాయిలో ఎందుకు చేయకూడదు?’ అని అడిగారు. ‘కంటెంట్ బావుంది. గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా చేద్దాం’ అన్నారు. స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు అలా చేయడం సాధ్యం అవుతుంది. సమంత గారిని కలిసిన తర్వాత భారీ స్కేల్‌లో చేయాలనుకున్నాం. మేం ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని కథ రాశాం. కంటెంట్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్‌లో ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. టెక్నికల్ పరంగా కమర్షియల్ సినిమాలా ఉంటుంది.

వాస్తవ ఘటనల ఆధారంగా స్క్రిప్ట్ రాశారని సమంత చెప్పారు. ఇప్పుడు సరోగసీపై ఎక్కువ చర్చ జరుగుతోంది. స్క్రిప్ట్ రాసేటప్పుడు మీరేం ఆలోచించారు?

సరోగసీ మెయిన్ స్టోరీ కాదు. కథలో అదొక భాగమంతే! అందుకే, ఓపెన్‌గా చెప్పేశాం. సరోగసీ కంటే కథలో ఇంకా ఉంది. వార్తల్లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా స్క్రిప్ట్ రాశాం. సినిమా చూసినప్పుడు మీరు షాక్ అవుతారు.

‘యశోద’ స్టోరీ ఐడియా ఎవరిది?

హరీష్ న్యూస్ చూసి దీనిపై మనం ఏమైనా చేద్దామా? అని అడిగారు. మేం కలిసి స్క్రిప్ట్ డెవలప్ చేశాం. కరోనా లాక్‌డౌన్‌లో చాలా టైమ్ లభించింది. అప్పుడు ఇదంతా జరిగింది.

ఇంటర్నేషనల్ సినిమా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా?

లేదు. నో మూవీ రిఫరెన్స్… ఓన్లీ న్యూస్ రిఫరెన్స్! ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరికీ ఐడియా లేదు.
కథను చెప్పడంలో మీకు ఛాలెంజింగ్ అనిపించిన విషయాలు ఏంటి?న్యూస్ చూసి స్క్రిప్ట్ డెవలప్ చేసిన తర్వాత సస్పెన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేశాం. ఆ తర్వాత స్క్రీన్ ప్లే మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. నెక్స్ట్ ఏం అవుతుంది? అనే టెన్షన్ ప్రేక్షకుల్లో ఉంటుంది.

తమిళంలో కాకుండా తెలుగులో ఎందుకు చేయాలనుకున్నారు?

తెలుగు చేయడానికి కారణం మా ఫ్రెండ్, ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సెంథిల్ గారు. ఫస్ట్ వెర్షన్ రెడీ చేస్తున్న సమయంలో ఆయన ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. ఫస్ట్ వెర్షన్ విన్నాక ఒపీనియన్ కోసం కృష్ణప్రసాద్ గారికి ఫోనులో నేరేషన్ ఇచ్చారు. ఎస్పీ బాలు గారి అంత్యక్రియలకు ఆయన చెన్నై వచ్చినప్పుడు మేం కలిశాం. మా అందరికీ ఓకే అయితే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ కథ భారీ స్థాయిలో తీస్తే బావుంటుందని సెంథిల్ ఓకే అన్నారు. ఆయన తన స్వార్థం చూసుకోకుండా కథ గురించి ఆలోచించారు. కృష్ణప్రసాద్ గారు పాన్ ఇండియా స్థాయిలో భారీ తీద్దామని చెప్పడంతో అందుకు తగ్గట్టు కథ రెడీ చేసి సమంత గారికి చెప్పాం.

సమంతతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? సెట్స్‌లో ఆవిడ ఎలా ఉంటారు?

ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే రెండు నిమిషాల సమయం అడుగుతారు. సెట్ అంతా సైలెన్స్ అయ్యాక ఈజీగా చేసేస్తారు. గ్లిజరిన్ కూడా వాడరు. మేం ఏం కోరుకొన్నామో… అది ఈజీగా ఇచ్చేసేవారు. ప్రతి 20 నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళుతుంది. సర్‌ప్రైజ్‌లు షాక్ ఇస్తాయి. మేం చేసిన సినిమాల్లో ఎమోషనల్ సీన్ ఇది. మహిళలు, మాతృత్వం గురించి చెప్పాం. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఆవిడ చాలా బాగా చేశారు. ‘మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా?’ అని అడిగేవారు.

సమంత హెల్త్ కండిషన్ వల్ల షూటింగ్ చేయడం ఇబ్బంది అయ్యిందా?

పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేటప్పుడు మాకు ఆ విషయం తెలిసింది. ఆవిడ వల్ల ఎప్పుడూ షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. ఒక స్టంట్ సీన్ అద్భుతంగా చేశారు. ఆ రోజు సాయంత్రం ప్యాకప్ చెప్పేటప్పుడు ఆవిడకు జ్వరం ఉందని తెలిసింది. ఆవిడకు వర్క్ అంటే అంత డెడికేషన్. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని కోరుకుంటారు. యానిక్ బెన్ రెండు, వెంకట్ మాస్టర్ మూడు స్టంట్ సీన్స్ చేశారు.

యాక్షన్ సీన్స్ ముందే రాసుకున్నారా? లేదంటే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ చూశాక రాశారా?

మేం స్క్రిప్ట్ రాసినప్పుడు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సమంత గారు ఉండటంతో అవి ఎలివేట్ అయ్యాయి.

సరోగసీ మీద చాలా సినిమాలు వచ్చాయి? ఇందులో కొత్తదనం ఏంటి? మెడికల్ మాఫియా కూడా ఉంటుందా?

మెడికల్ మాఫియా తరహా సినిమా అనుకోవచ్చు. సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మాకు అది సర్‌ప్రైజింగ్‌గా ఉంది. లాక్‌డౌన్‌లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరొగసీకి ఇచ్చారు. ట్విన్స్ పుడితే వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి కూడా వాళ్ళు ఓకే అనేవారు.

సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం భారీ సెట్ వేశారని తెలిసింది. ఎందుకు?

‘ఈవా’ అని సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు పేరు పెట్టాం. ఆ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సెంటర్ గ్రాండ్ గా ఉండాలని ఊహించుకున్నాం. దాని కోసం హైదరాబాద్ సిటీలో స్టార్ హోటల్స్ అన్నీ చూశాం. మాకు షూటింగ్ చేయడానికి కొంచెం ఫ్రీడమ్ కావాలి. స్టార్ హోటల్స్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్పుడు నిర్మాతను అడిగితే సెట్ వేద్దామన్నారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారితో ‘జురాసిక్ పార్క్’లా ఉండాలని చెప్పాం. ఆయన అద్భుతమైన స్కెచ్ ఇచ్చారు. కృష్ణప్రసాద్ గారు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. పాన్ ఇండియా కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రజలు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాం.

మెజారిటీ షూటింగ్ ఎక్కడ చేశారు?

నానక్‌రామ్ గూడాలో సెట్స్ వేశాము. సినిమాలో మొత్తం 30, 40 సెట్స్ ఉంటాయి.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గురించి…
కథకు ఏం కావాలో అది ఇవ్వడమే కాదు… తెలుగు, తమిళ్ తెలిసిన వాళ్ళను ఎంపిక చేశారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మణిశర్మ, మార్తాండ్ కె. వెంకటేష్, సుకుమార్… ప్రతి ఒక్కరూ వంద, రెండొందల సినిమాలు చేశారు. మణిశర్మ గారు మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. మార్తాండ్ కె వెంకటేష్ గారు క్రిస్పీగా ఎడిట్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ హేమాంబర్ జాస్తి గారు (బుల్లి గారు) మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప గారు కూడా మంచి నటీనటులను ఎంపిక చేశారు.

సినిమాలో సాంగ్స్ ఉన్నాయా?

బిట్ సాంగ్స్ ఉన్నాయి. మణిశర్మ గారు అద్భుతమైన సంగీతం అందించారు. తొలిసారి ఆయనతో పని చేశాం. చిన్న చిన్న బిట్ సాంగ్స్ చేశారు. అవి విన్న ప్రతిసారి ఆ ఎమోషన్ గుర్తు వస్తుంది. అంత బాగా చేశారు.

మీ మాతృభాష తమిళం కాబట్టి… తమిళంలో ఆలోచిస్తారు. తెలుగులో అది వేరుగా ఉండొచ్చు. అది సినిమాపై ప్రభావం చూపించిందా?

లేదు అండి. పులగం చిన్నారాయణ గారు, డా. చల్లా భాగ్యలక్ష్మి గారు ఫ్లో ఈజీగా ఉండేలా చూసుకున్నారు. మా ఫీలింగ్ బాగా కన్వే చేశారు. మేం బౌండ్ స్క్రిప్ట్‌తో వాళ్ళను కలిశాం. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని యాడ్ చేశాం. మా మధ్య పాజిటివ్ కన్వర్జేషన్స్ జరిగాయి. ఇద్దరూ జర్నలిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళకు చాలా కమాండ్ ఉంది. బాగా చేశారు. మాకు కొంచెం తెలుగు వచ్చు. భాగ్యలక్ష్మి గారికి తెలుగు, తమిళం వచ్చు. పులగం గారు రాసింది ఆవిడ మాకు తమిళంలో వివరించేవారు. మా వర్క్ ఈజీ అయ్యింది. మహిళల కోణంలో ఆవిడ కొన్ని విషయాలు చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ గారి పాత్ర ఎలా ఉంటుంది?

ఆవిడకు కూడా జూమ్ కాల్‌లో స్టోరీ నేరేట్ చేశాం. 20 మినిట్స్ చెప్పాం. ఆవిడ మౌనంగా ఉంటే మాకు ఏమీ అర్థం కాలేదు. కథ అంతా విన్నాక ‘మీకు ఇటువంటి ఐడియాస్ ఎక్కడ నుంచి వస్తాయి?’ అని అడిగారు. ‘మీకు కథ ఓకేనా?’ అని అడిగితే చెప్పిన కథ స్క్రీన్ మీదకు తీసుకురమ్మని అన్నారు. ఆవిడను కొత్తగా చూస్తారు.

సినిమా ఎలా ఉండబోతోంది?

ఎమోషన్‌తో కూడిన థ్రిల్లర్ ‘యశోద’ అని చెప్పవచ్చు. సినిమా మొత్తం చూశాక మాకు అదే అనిపించింది. ఈ విషయంలో రాజమౌళి గారు మాకు ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి సన్నివేశంలో ఎమోషన్ ఉండాలని చెబుతారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నారని…ఆయనతో సినిమా ఉంది. మేం కొంచెం టైమ్ అడిగాం. స్టోరీ ఐడియాస్ ఉన్నాయి.