‘సైంధవ్’ లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ తో వెంకటేష్ గారి 75వ చిత్రానికి తగ్గట్టుగా వుంటుంది : శైలేష్ కొలను

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శైలేష్ కొలను విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

సైంధవ్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ అయ్యింది ?
– ‘హిట్ 2’ విడుదలైన తర్వాత నిర్మాత వెంకట్ గారు వెంకటేష్ గారిని కలవమని చెప్పారు. వెంకటేష్ గారిని కలిశాను. సినిమా బాగా తీశానని అభినందించారు. మొదట కలిసినప్పుడు అసలు సినిమా గురించి మాట్లాడలేదు. జనరల్ లైఫ్ గురించి సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. రెండు మూడు మీటింగ్స్ లో మా మధ్య మంచి బాండ్ ఏర్పడింది. తర్వాత కలసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అని ఇద్దరికీ అనిపించింది. అప్పుడు నా దగ్గర వున్న కథల్లో సైంధవ్ ఐడియా చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ‘ఇది నా 75వ సినిమా అనిపిస్తోంది’ అని చెప్పారు. తర్వాత ఐడియాని డెవలప్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా చెప్పాను. కథ మొత్తం విని ఓ హాగ్ ఇచ్చి.. ‘ఇది చేస్తున్నాం’ అన్నారు. ఆయన అనుభవాన్ని, ఫీడ్ బ్యాక్ ని జోడించి స్క్రిప్ట్ ని ఇంకా బెటర్ చేసిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం.

హిట్ తో రెండు విజయాలు అందుకున్నారు కదా.. దీనితో హ్యాట్రిక్ కొట్టాలనే ఒత్తిడి ఉందా ?
నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకొను. నిజాయితీగా సినిమాలు తీసుకుంటూ వెళ్ళడమే పైనే నా ద్రుష్టి వుంటుంది. జయాపజయాలు గురించి కాకుండా జర్నీని ఆస్వాదించే తత్వ్తం నాది. ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ నిజాయితీగా సినిమా తీస్తే ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతాను. సైంధవ్ కూడా అదే అభిరుచితో చేశాను.

ఇది వెంకటేష్ గారి 75వ చిత్రం కదా.. ఆ ఒత్తిడి ఉందా ?
మొదట లేదు. గత వారం రోజులుగా వుంది. ఈవెంట్స్ లో వెంకటేష్ గారి ఏవీలు చూస్తున్నపుడు ఇంత అద్భుతమైన జర్నీ వున్న హీరోతో సినిమా చేశామా? అనే టెన్షన్ వస్తుంది. నిజానికి ఈ ఒత్తిడి వెంకటేష్ గారు మా వరకూ తీసుకురాలేదు. అంత చక్కగా మాతో కలిసిపోయారు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. వెంకటేష్ గారి 75వ చిత్రం ఎలా ఉండాలో ఆలా చేశాం. ఫ్యాన్స్, ఆడియన్స్ కి నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం.

స్క్రిప్ట్ విషయంలో వెంకటేష్ గారు ఎలాంటి ఇన్ పుట్స్ ఇచ్చారు ?
ఇప్పటివరకూ నేను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చేశాను. ఇంత ఎమోషనల్ డెప్త్ వున్న కథ చేయడం ఇదే మొదటిసారి. వెంకటేష్ గారు ఎమోషనల్ సీన్స్ లో చాలా అద్భుతమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్ డీల్ చేయడంలో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి.

ఆర్య, ఆండ్రియా, రుహాని ఇలాంటి ప్రముఖ తారాగణం తీసుకోవడానికి కారణం ?
ఇందులో ప్రతి పాత్ర ఒక విషయాన్ని కమ్యునికేట్ చేస్తుంది. ఆ కమ్యునికేషన్ వైడర్ ఆడియన్స్ కి చేరాలి. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారి పోరాటానికి బలమైన గొంతుక లేదు. రూ.17 కోట్ల ఇంజక్షన్ కోసం తపన పడే పేరెంట్స్ గురించి, వారి పోరాటం గురించి మనకి పెద్ద అవగాహన లేదు. అలాంటి అవగాహన తెప్పించాలంటే వైడర్ గా కమ్యునికేట్ చేసే నటులు కావాలి, అలాంటి గొప్ప ఉద్దేశంతో, కథ నచ్చి ఆర్య, ఆండ్రియా, రుహాని శర్మ లాంటి నటులు ఇందులో భాగమయ్యారు. చాలా ముఖ్యమైన క్యామియో రోల్స్ లో కనిపిస్తారు. అయితే ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ ని సందేశాత్మకంగా చెప్పలేదు. సినిమాటిక్ లిబార్టీ తీసుకొని సినిమాటిక్ గానే చెప్పాం. ఈ సమస్య ఎలా పరిష్కరించాలి? అనే దానిలోకి వెళ్ళలేదు. సినిమా చూసిన ప్రేక్షకులే ఒక ఆలోచనలోకి వస్తారు. చాలా ఆర్గానిక్ గా రాసిన కథ ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది. లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ఇందులో ఎక్కువగా నైట్ సీక్వెన్స్ లు వున్నాయనిపిస్తుంది ?
-అవునండీ. ఈ కథ దాదాపు డెబ్బై శాతం నైట్ జరుగుతుంది. వెంకటేష్ గారికి ఇది ముందే చెప్పాను. మొదట.. వెంకటేష్ గారు, పాప, శ్రద్దా శ్రీనాథ్ పాత్రలు ఆసక్తికరంగా పరిచయమౌతూ కథ చాలా హాయిగా మొదలౌతుంది. పదిహేను నిమిషాల తర్వాత ప్రేక్షకులు తల తిప్పుకోలేరు. అంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఈ ప్రయాణంలో వెంకటేష్ గారికి అభిమానిగా మారిపోయినట్లు వున్నారు ?
ప్రీరిలీజ్ ఈవెంట్ లో అది చెప్పాను. నేను మద్రాస్ లో పుట్టాను. చిన్నప్పుడు కమల్ హాసన్ గారి సినిమాలు చూశాను. దీంతో ఆయన వర్క్ నాపై ఒక ముద్ర వేసింది. కమల్ హాసన్ హేరామ్ సినిమా చూసిన తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. వెంకటేష్ గారితో వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన క్లోజప్పులు, నటన చూస్తుంటే… అద్భుతం అనిపించింది. చిన్నపుడు వెంకటేష్ గారి సినిమాలు చూసుంటే ఆయన కూడా నాపై ప్రభావం చూపేవారు కదా అనిపించింది. అందుకే వెంకటేష్ గారికి అభిమానిగా మారానని చెప్పాను.

నవాజుద్దిన్ ని తీసుకోవాలనే నిర్ణయం ఎవరిదీ ?
నాదే. ఆ ఆలోచన వెంకటేష్ గారి కి చెబితే బాగా వర్క్ అవుట్ అవుతుందని అన్నారు. తర్వాత నిర్మాత వెంకట్ గారికి చెప్పి అప్రోచ్ అయ్యాం. ఇందులో నవాజుద్దిన్ గారి పాత్ర చాలా యూనిక్ గా వుంటుంది. ఇప్పటివరకూ ఆయన ఇలాంటి పాత్ర చేయలేదు. ఆయన సౌత్ సినిమాలు పెద్దగా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. డబ్బింగ్ ఆయనతో చేయించడం లేదనేది ఆయన కారణం. ఇందులో లక్కీగా వచ్చీరాని తెలుగు మాట్లాడే పాత్రని రాసుకున్నాను. ఈ పాత్రకు ఆయన డబ్బింగ్ చెప్పడమే కరెక్ట్. అది ఆయనకి నచ్చింది. చాలా ఆసక్తితో ప్రత్యేక శ్రద్దతీసుకొని డబ్బింగ్ చెప్పారు.

సైంధవ్ లో ‘ఇంద్రప్రస్థ’ సిటీ గురించి చెప్పండి ?
డ్రగ్ కార్టేల్స్, గన్ బిజినెస్..ఇలా పెద్ద స్కేల్ లో ఇందులో కథ జరుగుతుంటుంది. ఈ కథ సముద్రతీరంలో జరగాలి. వైజాగ్ లో ఇంత పెద్ద కార్యకలాపాలు జరుగుతాయంటే నమ్మశక్యంగా వుండదు. ముంబైలో పెట్టుకుంటే నేటివిటీ పోతుంది. అందుకే ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ ని క్రియేట్ చేశాం.

సైంధవ్ చాలా కాస్ట్లీ సినిమాల కనిపిస్తోంది.. నిర్మాత సహకారం గురించి ?
నిర్మాత వెంకట్ గారు మొదటి నుంచి చాలా క్లియర్ గా వున్నారు. ‘నాకు వెంకటేష్ గారు అంటే ఇష్టం. ఆయనకి గొప్ప సినిమా ఇవ్వాలి’’ అని వెంకట్ గారు ముందే చెప్పారు. కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు.

సైంధవ్ 2 వుంటుందా ?
హిట్ 1 ని ప్రేక్షకులు ఇష్టపడ్డారు కాబట్టి హిట్ 2 తీశాం. సైంధవ్ ని ప్రేక్షకులకు ఇష్టపడితే తప్పకుండా పార్ట్ 2 చేస్తామనే నమ్మకం వుంది. పార్ట్ 2 చేసే అవకాశం వున్న కథ ఇది. ప్రేక్షకులు కోరుకుంటే తప్పకుండా వెంకటేష్ గారు నేను కలసి సైంధవ్ 2 చేస్తాం.

మీ నుంచి ఒక ప్రేమకథని ఆశించవచ్చా ?
నాకూ చేయాలనే వుంది. నా దగ్గర ఒక మంచి ప్రేమకథ వుంది. నా లైఫ్ లో జరిగిన సంఘటనలని తీసుకునే ఒక ప్రేమకథని రాశాను. తప్పకుండా ఈ కథని చేస్తాను.

హిట్ 3 గురించి ?
హిట్ 3 రైటింగ్ జరుగుతోంది. అయితే ఆ ఫ్రాంచైజ్ లో వచ్చే సినిమాలకి ఒక మారినేషన్ పిరియడ్ వుండాలనేది మా ఆలోచన. హిట్3 రావడానికి ఏడాదిన్నర పడుతుందని భావిస్తున్నాం.