రీమేక్ రచ్చ : రౌడీ బాలయ్య…పోలీస్ రాజశేఖర్

ఒక భాషలో హిట్టైన సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుంది కానీ అందుకు తగ్గ స్టార్ కాస్టింగ్ దగ్గరే సమస్యలు వస్తాయి. రెగ్యులర్ మసాలా సినిమాలకు పెద్దగా ఆ సమస్యలు రావు. కానీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా చేసిన సినిమాలు మాత్రం రీమేక్ చేయాలంటే ఆచి, తూచి అడుగులు వెయ్యాలి.

గత కొద్ది రోజులుగా తమిళంలో విజయవంతమైన ‘విక్రమ్‌ వేద’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాధవన్‌, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన ఆ సినిమా రీమేక్‌ కోసం నాగార్జున, రానా పేరు పరిశీలనలోకి వచ్చాయి. కానీ కార్యరూపం దాల్చలేదు.

తాజాగా ఆ చిత్రాన్ని బాలకృష్ణ, రాజశేఖర్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్రం రైట్స్ ను దక్కించుకున్న నిర్మాత ఈ రీమేక్ విషయమై రాజశేఖర్ తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆయన బాలయ్య వద్దకు కూడా వెళ్లి రీమేక్ లో నటించాల్సిందిగా అడగనున్నారని వినిపిస్తోంది. అయితే రాజశేఖర్ ఒప్పుకున్నట్లుగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనే విషయమై చర్చ మొదలైంది.

తమిళంలో పుష్క‌ర్ గాయ‌త్రి తెర‌కెక్కించిన విక్ర‌మ్ వేద‌ చిత్రంలో ఓ పోలీస్ అధికారి.. వీధిరౌడీ మ‌ధ్య జ‌రిగే పోరాటం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో మాధ‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌గా, విజ‌య్ సేతుప‌తి నెగిటివ్ పాత్రలో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 2017 జులైలో విడుదలైన ఈ చిత్రం రూ.11 కోట్ల బడ్జెట్‌తో నిర్మితం కాగా, రూ.64 కోట్లు వసూళ్లు రాబట్టింది.

ఇక బాలకృష్ణ తదుపరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. రాజశేఖర్‌ ‘కల్కి’తో బిజీగా ఉన్నారు. ఎన్నికల తర్వాతే ఈ కలయికలో సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.