మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ స్టోరీ లైన్ ఇదా?

సినిమా ప్రారంభం రోజునే ఈ సినిమా కథ ఫలానా అంటకదా…ఫలానా సినిమాలను కాపీ కొట్టి చేస్తున్నారంటగా అంటూ మీడియాలో వార్తలు వచ్చేస్తున్నాయి. అందులో నిజా నిజాలు ఎంత ఉన్నా, ఎవరికీ నష్టం లేదు కాబట్టి ఆ రూమర్స్ అలా ముందుకు వెళ్తూనే ఉంటాయి. టీమ్ కూడా వీటిని చూసి నిజమైతే షాక్ అవటం , లేకపోతే నవ్వుకోవటం చేస్తూంటుంది. అంతకు మించి ముందుకు వచ్చి స్పందించరు. ఇప్పుడు మహేష్ కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా అదే పరిస్దితి నెలకొంది.

మహర్షితో రీసెంట్ గా సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కొత్త సినిమా ఈ రోజు ప్రారంభమైంది. మహేష్‌ 26వ సినిమాగా డిఫరెంట్‌ మూవీని ఎంచుకున్నాడని తెలుస్తోంది. వరుస హిట్స్ తో సూపర్‌ ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు టైటిల్ తో ఈ సినిమాను ప్రారంభించాడు మహేష్‌. ఈ సినిమా అలా లాంచ్ అయ్యిందో లేదో అప్పుడే ఈ సినిమా కథ ..ఫలానా సినిమానుంచి ప్రేరణ పొందారని వార్తలు వచ్చేసాయి.

ఈ సినిమా కథను ఏవో ఇంగ్లీష్ సినిమాల నుంచి కాకుండా మన పాత తెలుగు చిత్రాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసుకున్నట్లు చెప్తున్నారు. అప్పట్లో వెంకటేష్ నటించిన ‘వారసుడొచ్చాడు’, మహేష్ ‘అతడు’ నుంచి కథ తీసుకున్నాడంటున్నారు. ఆ రెండు సినిమాల్లోలాగానే ఈ సినిమాలో హీరో కూడా తనతో కలిసి ఆర్మీలో పని చేసే ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లాల్సిన పని పడుతుందిట. ఆ స్నేహితుడు చనిపోయాడనే వార్త చెప్తామని అనుకుంటాడట.

అయితే అక్కడ కొన్ని భాధ్యతలు ఉండటంతో … అక్కడే కొంతకాలం ఉండిపోవాల్సి వస్తుందిట. దాంతో ఆ క్రమంలో తన స్నేహితుడు ఫ్యామిలీకి ఊరుకి సహాయం చేయడం వంటి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. అయితే ఇంత సింపుల్ లైన్ ని మహేష్ కోసం రెడీ చేసారంటే మాత్రం నమ్మబుద్ది కాదని కొందరు అభిమానులు వాదిస్తున్నారు. కానీ ఎఫ్ 2 సినిమా కూడా పాత కథే కదా..కానీ సూపర్ హిట్ కొట్టాడు కదా ..ఇప్పుడు ఇలాగే చేస్తాడని మరికొందరు అంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓపెనింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్‌ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా మహేష్ హాజరు కాలేదు.