వినాయక్…ఏంటి రచ్చ?,వింటానికి వింతగా ఉంది

మాస్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన వివి వినాయక్ గత కొంతకాలంగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన సరైన కథతో వస్తే మళ్లీ బ్లాక్ బస్టర్ ఇస్తారని ఫ్యాన్స్ నమ్మకం. ఈ నేఫధ్యంలో ఆయన దర్శకత్వంలో సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని విధంగా ఒక సర్ ప్రైజింగ్ వార్త ఒకటి సినీ వర్గాల్లోనూ, మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. అది వివి వినాయిక్ హీరోగా ఓ చిత్రం రూపొందబోతోందని తెలియటం.

ఈ మధ్యనే శరభ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన ఎన్ నరసింహారావు దర్శకత్వంలో వినాయక్ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడని . ఈ చిత్రంను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడనే వార్త మరింత షాకింగ్ గా ఉంది. గతంలో చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ చిత్రంలో వినాయక్ చిన్న పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే.

ఇక వి.వి.వినాయక్ వయసు, ఫిజిక్ కి తగ్గట్లు.. స్క్రిప్ట్ ఉంటుందని.. అందుకే హీరోగా నటించడానికి వినాయక్ కూడా అంగీకరించాడని చెప్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంభందించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అయితే అఫీషియల్ ప్రకటన వస్తే గానీ ఇలాంటి వార్తలను నమ్మటం కష్టమే.

2018లో వచ్చిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ అయ్యింది.