అజిత్ చేసిన పాత్రలో బాల‌య్య‌? భారీ ప్లానింగ్

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు ఒకడు. కథల్లో పెర్ఫెక్ట్ జడ్జ్ మెంట్, బడ్జెట్‌లో పక్కా ప్లానింగ్ ఆయన్ను ఆ స్టేజికి తీసుకు వచ్చాయి. ఆయన ఇప్పటివరకూ దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ సినిమాలు నిర్మించాడు. కానీ కొందరు హీరోలు మిగిలిపోయారు. వాళ్ళలో నందమూరి బాలకృష్ణ ఒకరు. గత కొంతకాలంగా ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నాయి.కానీ ఇంతవరకూ సరైన స్క్రిప్ట్ దొరకలేదట. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చిందంటున్నారు.

తాప్సి ప్రధాన పాత్ర‌లో తెర‌కెక్కి హిట్టైన బాలీవుడ్ సినిమా `పింక్‌`. ఆ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర పోషించారు. ఆ సినిమా ప్ర‌స్తుతం త‌మిళంలోకి రీమేక్ అవుతోంది. త‌మిళ రీమేక్‌లో తాప్సి పాత్ర‌ను శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అమితాబ్ పాత్ర‌ను అజిత్ పోషిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా తెలుగులో కూడా తెర‌కెక్క‌బోతోంద‌ని అంటున్నారు.

ఇక ఈ తెలుగు రీమేక్‌ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకుని నిర్మించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అమితాబ్ పాత్ర‌లోకి బాల‌య్య‌ను తీసుకోవాల‌నుకుంటున్న‌ట్టు చెప్పుకుంటున్నారు. బాల‌య్య ఓకే అంటే వీలైనంత త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్టు స‌మాచారం.

త్వరలోనే బాలకృష్ణకు కథ వినిపించి ఆయన్నుంచి గ్రీన్‌సిగ్నల్ అందుకుంటే స్ర్కిప్ట్ మీద పూర్తి స్థాయిలో వర్క్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట. మరి బాలయ్య- దిల్ రాజు కాంబో నిజంగానే సెట్ అవుతుందో లేదో చూడాలి. బాల‌య్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మాత్రం వెంక‌టేష్‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోల‌ను టచ్ చేయాలని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.