ఈ టాక్ కొరటాల శివ కొంపముంచేటట్లుందే

రచయిత నుంచి దర్శకుడుగా మారి సక్సెస్ అయ్యన వారిలో కొరటాల శివ మొదటి వరసలో ఉంటారు. తన సినిమాలకు పకడ్బందీ స్క్రీన్ ప్లే, అందుకు తగ్గ విజువల్స్ ని సమకూర్చుకుంటూ వరస విజయాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక అంశాలను తన కథలో చొప్పించటం ఆయనకు ప్లస్ అవుతోంది. త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది.

అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వీరి సినిమా సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం కథ విషయమై అప్పుడే స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈ కథ విషయమై టాలీవుడ్ మీడియా లో ఓ ప్రచారం కూడా మొదలైంది ఈ సినిమా కోసం కొరటాల ‘ఠాగూర్‌’ తరహా కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఎమోషన్స్ తో కూడినఅంశాలతో పాటు, మంచి సందేశాత్మకమైన సినిమాను చిరుతో తీయాలని కొరటాల భావిస్తున్నారట. పదిహేనేళ్ల క్రితం విడుదలైన ‘ఠాగూర్‌’ చిత్రం చిరు కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. ఇప్పుడు అలాంటి కథనే కొరటాల వండుతున్నారని టాక్ స్టార్టైంది. అయితే ఇలాంటి టాక్ వల్ల కొరటాల శివ..కొత్త కథలు చేయరని,పాత కథలనే తిరిగి రిపీట్ చేస్తున్నారని అనిపిస్తుంది.

ఇక కొరటాల తీయబోయే సినిమాను చిరు తనయుడు రామ్‌చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరు ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రం రాబోతోంది. నయనతార హీరోయిన్. జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా పూర్తయ్యాకే చిరు తన తర్వాత ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.