Somu Veerraju: ఏపీ శాసనమండలిలో ఉద్రిక్తత: రణరంగంగా మారిన సభ.. సోము వీర్రాజుపై దాడికి యత్నం!

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో మండలి ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.

మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరిగిన చర్చలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మంత్రి సమాధానం ముగిసిన తర్వాత, ఈ అంశంపై తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయని, ఇంకా చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే, మంత్రి వివరణ ఇప్పటికే పూర్తయిందని స్పష్టం చేసిన ఛైర్మన్ మోషేనురాజు, తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు.

ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు సిద్ధమవగా, వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మేము నిరసన తెలుపుతుండగా సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారు?” అంటూ వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ మరియు ఇతర సభ్యులు ఆగ్రహంతో వీర్రాజు సీటు వైపు దూసుకెళ్లారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది.

పరిస్థితి విషమిస్తుండటాన్ని గమనించిన మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్ తక్షణమే స్పందించారు. వారు సోము వీర్రాజుకు అండగా నిలబడి, దూసుకువస్తున్న వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట, వాగ్వాదం జరగడంతో సభ నియంత్రణ తప్పింది.

సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకురావడం, పోడియం వద్ద గందరగోళం సృష్టించడంతో సభను నిర్వహించడం అసాధ్యమని భావించిన ఛైర్మన్ మోషేనురాజు.. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభ, సభ్యుల వ్యక్తిగత దూషణలు, తోపులాటలతో రణరంగంగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

శివాజీకి ఘోర అవమానం..|| Chhatrapati Shivaji Photo at Hotel Toilet Rooms : Dasari Vignan || TR