తిరుపతి నుంచి ప్రముఖులెవరూ పోటీ చేయరు, ఎందుకు?

సాధారణంగా అయితే, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి అంతగా ప్రాముఖ్యం లేదు. అందుకే ప్రముఖ నేతలెవరూ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. వచ్చిందల్లా ఒక్కరే. ఆయన రాజకీయాలు దాంతో ముగిశాయి. ఆయనెవరో కాదు, ప్రజారాజ్యం నేత చిరంజీవి.

ప్రజారాజ్యం పార్టీ సంస్థాపకుడయిన  చిరంజీవి పోటీ చేసి గెల్చినపుడు తిరుపతికి కొంత గుర్తింపు వచ్చింది. అయితే, ఆయన పార్టీ నిలవ లేదు. కాంగ్రెస్ లో కలసి పోయింది. ఆయన రాజకీయ జీవితం కూడా ముగింపు కొచ్చింది.

 శ్రీవారుకొలువై ఉన్నా తిరుపతి ఎపుడూ విఐపి నియోజకవర్గం కాలేదు. తిరుపతి మీద పార్టీలపెద్దలేవరూ కన్నేయలేదు. ఆ జిల్లాకే చెందిన చంద్రబాబు నాయుడు కూడా తన వూరి పక్కనే ఉన్నా తిరుపతి నియోజకవర్గాన్ని కాకుండా కుప్పంను తన నియోజకవర్గం చేసుకున్నారు. అంతకుముందు ఎన్టీరామరావు మూడు ప్రాంతాల నుంచి పోటీ చేస్తానని చెప్పి హిందూపురం ఎంచుకున్నారు తప్ప ఏడుకొండలవాడి సన్నిధికి రాలేదు.

అన్న చిరంజీవి పోటీ చేసిన నియోజకవర్గంనుంచి పోటీ చేస్తానని, ఏడుకొండల వాడి కరుణ ఉంటుందని అంటూ  పోటీ చేసేందుకు జనసేన నేత కూడా ముందుకు రావడం లేదు.  కారణం ఏమై ఉంటుంది, రాజకీయాల్లో దేవుడికి గిట్టని పనులు చాలా చేయాల్సి ఉంటుంది. ఏడుకొండల వాడి లోగిట్లో అలాంటి పనులు చేయడం ఇష్టం లేకానా? భయమా? ఏమో చెప్పలేం!

విభజన తర్వాత తిరుపతి ప్రాముఖ్యం పెరిగినట్లుంది. తిరుపతిని రీజినల్ హబ్ చేసి అక్కడ ఐటి కంపెనీలను ఏర్పాటుచేస్తూ ఉండటం, విద్యాసంస్థలను నెలకొల్పుతూ ఉండటంతో పాటు పరిశ్రమలను కూడా స్వాగతిస్తూ ఉండటంతో తిరుపతి ఇపుడు ప్రముఖ నియోజకవర్గమయింది. అమరావతి రాజధాని అయితే, రీజినల్ సెంటర్లుగా విశాఖ పట్టణాన్ని, తిరుపతిని అభివృద్ది చేయాలనుకుంటున్నారు.  తిరుపతి ప్రాముఖ్యం పెరిగేందుకు ఇదే కారణం.

అందుకే ఈ అసెంబ్లీ నియోజకర్గ తెలుగుదేశం పార్టీ టికెట్‌ కోసం పోటీ తీవ్రమయింది తప్ప, దేవుడి పేర ఉన్న ఈ నియోజకవర్గం నుంచ ఫలానా నేత పోటీ చేస్తారని వూహాగానాలు కూడా రావడం లేదు. టిడిపి టికెట్ కోసం  పోటీ పడుతున్నదంతా లోకల్ లీడర్లే.

వీళ్లలో కొందరేమో అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే, ఇంకొందరు చి న్నబాబు నారా లోకేష్‌ బ్లెసింగ్స్ కోసం ఎగబడుతున్నారు. వీళ్లంతా అమరావతిలో మకాం వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. తనకే టికెట్‌ వస్తుందని ఎమ్మెల్యే సుగుణమ్మ ధీమాగా ఉంటే మరోవైపు తుడ చైర్మన్‌ నరసింహయాదవ్‌ కూడా ఈ సారి తిరుపతి అసెంబ్లీ సీటు తనకు దక్కకుండా పోతుందా అని కాన్ఫిడెంటుగా చెబుతున్నారు. ఆయన యాదవ.

గతంలో బలిజలకు ఈ సీటు ఇచ్చారని, ఈ సారి యాదవ సామాజిక వర్గం వారికి అవకాశం కల్పిస్తానని సీఎం మాట ఇచ్చారని కూడా ఆయన చెప్పుకుంటున్నారు.

ఇక్కడ పేరు మోసిన రియల్టర్‌ ఊకా విజయకుమార్‌ టికెట్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దగ్గిర బాగా డబ్బుందని, ఈసారి ఖర్చు పెట్టుకునే వాడికే ఈ సీటు వస్తుందని ఆయన నమ్మకం. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ గల్లా జయదేవ్‌ ఆయనను బలపరుస్తున్నట్లు సమాచారం.

ఈ నియోజకవర్గంలో బలిజలు ఎక్కువని, ఈ సీటు తనకు ఇవ్వాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్‌ కోరుతున్నారు. వీళ్లేకాకుండా కడప జిల్లా ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, తిరుపతికి చెందిన డాక్టర్‌ సుధారాణి, డాక్టర్‌ ఆశాలత తిరుపతి అసెంబ్లీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. వీరంతా ఒకరికి తెలియకుండా ఒకరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, మంత్రులు, బంధువులు, కుమారుడు లోకేష్‌ ద్వారా ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం.

ఇది ఇలా నడుస్తుంటే చంద్రబాబు సర్వేల ప్రకారం వెళ్లాలని భావిస్తున్నారని, సర్వేను బట్టి ఆయన కొత్త వారికి ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నారని అమరావతిలో వినపడుతూ ఉంది. ఎందుకంటే, తిరుపతి ప్రాముఖ్యం పెరగడంతో ఈ నియోజకవర్గం మీద పట్టు బాగా బిగించేందుకు కొత్తవారికిస్తే, లోకేష్ కంట్రోల్ లో ఉంటారని, పాతవారికంటే కొత్త వారికి అవకాశమీయడం మంచిదని ముఖ్యమంత్రికి కొందరు జిల్లా పెద్దలు సూచించారని కూడా చెుబుతున్నారు.