డెట్రాయిట్: వల వేసి నేరస్థులను పట్టుకునేందుకు ఒక బోగస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం అమెరికా ఫెడరల్ ప్రభుత్వాధికారులు చేసిన పెద్ద తప్పని అరెస్టయిన ఒక విద్యార్థి తరఫున వాదించిన ఆదేశ న్యాయవాది ఒకరు అంటున్నారు. వలవేసి పట్టుకునేందుకు అమెరికా అధికారులు యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అక్రమంగా సృష్టించి తప్పుచేశారనేది డిఫెన్స్ అటార్నీ జాన్ బ్రస్టార్ వాదన.

స్టూడెంట్ వీసా సంపాదించి పెట్టేందుకు ఫేక్ యూనివర్శిటీలలో అంతర్జాతీయ విద్యార్థులను ముఖ్యంగా తెలుగు వారిని అడ్మిట్ చేయించే బాగోతం నడుపుతున్నారన అరోపణ మీద అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు గతవారంలో ఎనిమిది మంది తెలుగు రిక్రూటర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఫణిదీప్ కర్నాటి ( ఫోటో) ఒకరు. ఇమిగ్రేషన్ రాకెట్ ను ఛేదించేందుకు అమెరికా అధికారులు ‘పేపర్ చేజ్ ’ పేరుతో స్టింగ్ ఆపరేషన్ ప్రారంభించారు.ఈ రాకెట్ లో కనీసం 600 మంది దాకా ఇరుక్కుపోయి ఉన్నారు. వీరంతా అమెరికాలోనే ఉండిపోయేందుకు వచ్చిన వారని, అంతా కలసి 2,50,000 అమెరికన్ డాలర్ల దాకా బ్రోకర్లకు ఫీజు చెల్లించారని ప్రా సిక్యూటర్లు చెబుతున్నారు. వీళ్లెవరికి ఫార్మింగ్టన్ యూనివర్శీటీ ఫేక్ అని తెలియదు.
ఈ కేసు లో ఫణిదీప్ తరఫున వాదిస్తూ ఇమిగ్రేషన్ రాకెట్ ను ఛేదించేందుకు ప్రభుత్వమే ప్రజలను ట్రాప్ చేయాలను కోవడం సబబుకాదని బ్రస్టార్ అంటున్నారు.ఫణిదీప్ ను $10,000 ల పూచికత్తుతో విడుదల చేసిన తర్వాత బ్రస్టార్ మీడియాతోమాట్లాడారు. ఫణిదీప్ కు వివాహమయింది. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు.లూయిస్ విలీలో ఆయన ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్. పదేళ్ల కిందట H-1B వీసా మీద అమెరికా వచ్చాడు. కంపెనీలు తాత్కాలికంగా విదేశీ ఉద్యోగులను రప్పించుకునేందుకు ఇచ్చే వీసా ఇది.
ఫణిదీప్ ను సోమవారం నాడు ఫెడరల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయన బెయిల్ కోరుకున్నారు. మిగతా వారెవరూ బెయిల్ మీద బటయకు రావాలనుకోవడం లేదు.
మిగతా వాళ్లకు సంబంధించి సంతోస్ రెడ్డి సామా (28) విచారణ కాలంలో కస్టడీలోనే ఉండాలని కోరుకున్నారు. అదే విధంగా పెనిసిల్వేనియా హ్యరిష్ బర్గ్ కు చెందిన అవినాశ్ తక్కెళ్ల పల్లి (28) కూడా కస్టడీలో ఉండేందుకు ఇష్టపడ్డారు. డల్లాస్ కు చెందిన నవీన్ ప్రతిపాటి (29), అట్లాంటాకు చెందిన అశ్వంత్ నూనె (26) కూడా కస్టడీలో ఉంటారు. వీరిద్దరు ఐటి కంపెనీ స్ర్పింట్ కార్ప్ లో పనిచేస్తున్నారు. వీళ్లందరి మీద వీసా ఫ్రాండ్ కుట్ర, విదేశీయులకు ఆశ్రయమీయడం వంటి నేరారోపణ చేశారు. ఈ నేరాలు రుజువయితే, వారికి అయిదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ యుఎస్ మాజిస్ట్రేట్ జడ్డ్ ఆర్ స్టీవెన్ వాలెన్ వాళ్లంతా మేం నిర్దోషులమన్న స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు.
ఈ కేసులో ఉన్న మిగతావారు భరత్ కాకిరెడ్డి (29) లేక్ మేరీ, ఫ్లారిడా సురేష్ రెడ్డి కందాల (31)కల్ పీపర్ , వర్జీనియా, ప్రేమ్ కుమార్ రాంపీసా (26), షార్లట్ , నార్త్ కెరోలినా.
