CM Breakfast Scheme: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్’ పథకానికి సంబంధించిన మెనూను విద్యాశాఖ తాజాగా ఖరారు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాలతో కూడిన మెనూను అధికారులు రూపొందించారు. వారానికి ఆరు రోజుల పాటు వేడివేడిగా అందించే అల్పాహారం వివరాలు ఇవే,
సోమవారం: దోసె-చట్నీ లేదా చపాతీ-కూర.
మంగళవారం: రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు.
బుధవారం: రెండు పూరీలు-ఆలూ కుర్మా.
గురువారం: రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు.
శుక్రవారం: మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ.
శనివారం: రెండు బోండాలు-చట్నీ.

అల్పాహారంతో పాటు అదనపు పోషకాల కోసం రోజు విడిచి రోజు పాలు, రాగిజావను (వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ) విద్యార్థులకు అందజేయనున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా అల్పాహారం తీసుకునేందుకు వీలుగా రోజూ 45 నిమిషాల సమయం కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
22 లక్షల మందికి ప్రయోజనం.. భారీ బడ్జెట్ కేటాయింపు, ఈ పథకం ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ విద్యార్థులందరికీ వర్తించనుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. పథకం అమలు కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
పాఠశాల విద్యార్థుల టిఫిన్ కోసం: ₹540 కోట్లు
పాల సరఫరా కోసం: ₹180 కోట్లు
ఇంటర్ విద్యార్థుల కోసం అదనంగా: ₹56 కోట్లు
తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న బ్రేక్ఫాస్ట్ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఈ సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇది విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడమే కాకుండా, వారిలో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

