Simbaa Movie Review: ‘సింబా’ మూవీ రివ్యూ & రేటింగ్ …

అందాల నటి అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, వశిష్ఠ, గౌతమి, కబీర్ సింగ్ దుల్హన్, ప్రదీప్… తదితరులు ముఖ్యపాత్ర ధారులుగా తెరకెక్కిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రానికి కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైఫై(సైంటిఫిక్) థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం…

కథ: అక్ష(అనసూయ) ఒక టీచర్. తన భర్తకు యాక్సిడెంట్ లో కాళ్ళు పోవడంతో తనే ఇంటిని నడిపిస్తుంది. ఒకరోజు రోడ్డు మీద ఒక వ్యక్తిని చూడగానే అనసూయ మైండ్ లో ఏదో జరిగి అతన్నే ఫాలో అయి వెళ్లి చంపేస్తుంది. ఈ మర్డర్ కేసుని పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ), జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్) ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఒక రోజు సరదాగా ఫ్యామిలీతో అక్ష ఒక షాపింగ్ ఏరియాకు వస్తుంది. ఫాజిల్ కూడా తన లవర్ ఇష్ట(దివి)తో, అనురాగ్ కేసు విచారణ కోసం ఆ ప్లేస్ కి వస్తారు. అక్కడ కూడా ఒక వ్యక్తిని చూడగానే ఈసారి అక్షతో పాటు ఫాజిల్ కి కూడా మైండ్ లో ఏదో జరిగి వెళ్లి అతన్ని చంపేస్తారు.

అనురాగ్ వీళ్ళని అరెస్ట్ చేస్తాడు. చనిపోయిన ఇద్దరూ పార్థ ఇండస్ట్రీస్ యజమాని పార్థ(కబీర్ సింగ్ దుల్హన్) మనుషులు కావడంతో వీళ్ళిద్దర్నీ చంపేయాలని సిన్సియర్ ఆఫీసర్ అయిన అనురాగ్ ని కేసు నుంచి తప్పించి… పార్థ తమ్ముడు తీర్థ(ప్రదీప్) గ్యాంగ్… అక్ష, ఫాజిల్ ని కోర్టుకు తీసుకెళ్తుండగా అటాక్ చేస్తారు. దాంతో వారిద్దరితో పాటు డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) కూడా వచ్చి తీర్థని చంపేస్తారు. ఇలా ఎందుకు ఈ ముగ్గురు కలిసి పార్థ మనుషులను టార్గెట్ చేసి చంపారు? వారి మైండ్ లో జరుగుతున్న బయోలాజికల్ మెమోరీస్ ఏంటి? వీరి ముగ్గురు శత్రువులను చంపడంలో ఎందుకు ఒకటే అవుతున్నారు? వీరిలో వున్న ఇంటర్నల్ సెల్యూలర్ మెమోరీస్ ఏంటి? దానిని ఏసీపీ అనురాగ్ అండ్ సైకియాట్రిస్ట్ గౌతమి ఎలా సాల్వ్ చేశారు? ఈ ఎపిసోడ్ కి అంతా కారణం ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: కాన్సెప్ట్ స్టోరీస్ చాలా సీరియస్ గానే ఉంటాయి. వాటిని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరపై ఆవిష్కరిస్తే… ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అందులోనూ థ్రిల్లింగ్ అంశాలుంటే… మరింత ఎంగేజింగ్ గా ఉంటుంది. దాంతో ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాని ఆడియన్స్ ఫీల్ తో చూస్తారు. అలాగే రివేంజ్ డ్రామాకి తోడుగా ఓ మెసేజ్ ని జోడించి తీసిన ఈ సినిమా… సాధారణ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుంది. కొంచెం పాత్రధారుల ప్రవర్థించే తీరును కొన్ని కేస్ స్టడీస్ ను బేస్ చేసుకుని తెరమీదకెక్కించిన తీరు కూడా కన్వెన్సింగ్ గా ఉంది. దానికి కొన్ని దశాబ్దాల క్రితమే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన సెల్యులర్ మెమరీ, బయోలజికల్ మెమరీస్ అనే సైకలాజికల్ పదాలను జోడించి… సినిమాలో చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దానికి తోడు మదర్ నేచర్ ను కాపాడుకోవాలి… ఎన్విరాన్ మెంట్ కు ఎగినెస్ట్ గా వెళితే ప్రకృతిలో జరిగే విధ్వంసం మానవాళి జీవన విధానాన్ని ఎలా విధ్వంసం చేస్తుందనే దాన్ని ఓ బస్ యాక్సిడెంట్ ద్వారా చాలా రియల్ స్టిక్ గా చూపించారు. నిబంధనలకు విరుద్దంగా అనేక పరిశ్రమలు వెలువరించే కాలుష్య ఉద్గారాలు మానవ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయే ఇందులో చూపించారు. అలాగే చెట్లు నరకడం వల్ల… ప్రజలకు జరిగే నష్టాన్ని ఇందులో ప్రతి మనిషికి రోజుకు ఎంత ఆక్సిజన్ కావాలి, అందుకు ఒక వ్యక్తికి ఎన్ని చెట్లు అవసరం అవుతాయి… మన దేశంలో ఎన్ని చెట్లు ఉన్నాయి… కెనడాలాంటి దేశంలో ఎన్ని చెట్లు ఉన్నాయనేదాన్ని గణాంకాలతో సహా పర్యావరణ ప్రేమికుడిగా పురుషోత్తం రెడ్డి పాత్రను వేసిన జగపతిబాబుతో చెప్పించడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

ఇంటర్వెల్ దాకా అక్ష, ఫాజిల్ బయోలాజికల్ మెమోరీస్ తో ప్రవర్తించే తీరును చూపించి… ఇంటర్వెల్ బ్యాంగ్ లో మరో పాత్రని డాక్టర్ ఇరాన్ రూపంలో వీరికి తోడుగా చూపించడంతో సెకెండాఫ్ పై మరింత అంచనాలు పెంచేశారు దర్శకుడు. వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారనే దాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపుతారు. అనుకున్నట్టే సెకెండాఫ్ లో వారి పాత్రల తీరుకు ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఓ మెసేజ్ ఓరియంటెడ్ రూపంలో చూపించి… ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలనే దాన్ని చూపించారు. చెట్లను నరికివేత నిశిద్ధం, భావి తరాలకోసం మొక్కలు నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం తదితర అంశాలను రేపటి తరంకోసమని చెప్పే తీరు బాగుంది. స్లో పాయిజన్ లాంటి మిథైల్ మెర్క్యూరీ, బయోలాజికల్ మెమోరీస్, సెల్యూలర్ మెమోరీస్ లాంటి సైంటిఫిక్ పదాలను వాడి… ప్రేక్షకులను ఓ కొత్త కథను చూసిన విధంగా మెప్పించారు దర్శకుడు.

హాట్ బ్యూటీ అనసూయ ప్రతి సినిమాకి ఏదో కొత్తదనం వుండేలా తన పాత్రను ఎంచుకుని నటిస్తోంది. ఇది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్నీ డిఫరెంట్ గానే ఉంటున్నాయి. ఇందులో కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నటించారు. అదే సమయంలో మాస్ ను మెప్పించే యాక్షన్ సీన్స్ లోనూ నటించి ఆకట్టుకుంది. యువ నటుడు మాగంటి శ్రీనాథ్… ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించి మెప్పించారు. అతనికి జోడీగా నటించిన దివి పాత్ర కూడా కాసేపు ఆకట్టుకుంటుంది. అలాగే ఏసీపీ పాత్రలో నటించిన వశిష్ఠ సింహా పాత్ర… త్రూ అవుట్ సినిమా సాగుతుంది. అతని నటన కూడా సీరియస్ గా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. అతనికి సహాయ నటులుగా చేసిన ఇద్దరి పోలీసు పాత్రలు కూడా బాగున్నాయి. నటుడు అనీష్ కురువిల్లా… డాక్టర్ ఇరాన్ పాత్రలో ఎప్పటిలాగే ఆయన లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటారు. విలన్ పాత్రలు పోషించిన దుల్హన్ కబీర్ సింగ్, ప్రదీప్ పాత్రలు రౌద్రంగా చూపించారు. అందుకు తగ్గట్టుగానే నటించారు వీరు. ఇక పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి పాత్రలో జగపతిబాబు పోషించిన సింబా పాత్ర హైలైట్. అతని ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పించడం సామాన్యులకు సైతం అర్థమవుతుంది. అతని భార్య తులసిగా నటి కస్తూరి నటించారు. సైకియాట్రిస్ట్ పాత్రలో నటి గౌతమి పాత్ర పర్వాలేదు. ఆమె ద్వారా కొన్ని కేస్ స్టడీస్ ని చెప్పించి… సినిమాలోని పాత్రలకు ఓ కన్ క్లూజన్ చివర్లో ఇప్పించడం అందరినీ కన్వెన్స్ చేస్తుంది.

ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కాబట్టి… దాని చుట్టూ రాసుకున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను కేస్ స్టడీస్ తో దర్శకుడు సంపత్ నంది బాగా కూర్పు చేసుకున్నారు. దానిని దర్శకుడు మురళీ మోహన్ రెడ్డి తెరపై బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమా తనకి డెబ్యూనే అయినా… ఎక్కడా తడబాటు లేకుండా క్లీన్ మూవీగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. విజువల్స్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగ కంపోజ్ చేశారు. ఫైట్స్ కంపోజింగ్ కూడా కొత్తగా వుంది. పెద్ద హీరోల సినిమాల్లో వుండే ఫైట్స్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అనసూయ… సంప్రదాయ చీరకట్టుతో చేసే ఫైట్స్ మాస్ ను ఆకట్టుకుంటాయి. నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని చాలా క్వాలిటీగా నిర్మించారు. ఈ వారం సరదాగా చూసేయండి.

రేటింగ్: 3.25