Khajipet Girl Murder: కడప జిల్లా ఖాజీపేట మండలంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రేమోన్మాది వెంకటేశ్పై పోలీసులు శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం నిందితుడు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తప్పించుకునే క్రమంలో కాల్పులు: పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వెంకటేశ్ను మైదుకూరు నుండి విచారణ నిమిత్తం మరో ప్రాంతానికి తరలిస్తుండగా, నిందితుడు ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తొలుత అతడిని హెచ్చరిస్తూ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు లొంగకుండా పోలీసులపైనే ఎదురుతిరగడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు వెంకటేశ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన అతడిని వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగింది?
ఖాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. అదే మండలంలోని ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్ గత కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి తెచ్చినప్పటికీ, బాలిక తిరస్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు, శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దాడి చేశాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఆమె నిరాకరించడంతో, వెంట తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతు కోసి పరారయ్యాడు.

తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను తండ్రి శ్రీనివాసులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యలో ఆమె ప్రాణాలు విడిచింది. మరణించే ముందు తన తండ్రితో వెంకటేశ్, ప్రవీణ్ అనే పేర్లను చెప్పినట్లు తెలుస్తోంది.
రాజకీయ దుమారం – వైఎస్ జగన్ ఆగ్రహం: ఈ దారుణ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
“రాష్ట్రంలో మహిళల భద్రత గాలికి కలిసిపోయింది. టీడీపీ పాలనలో చట్టం అంటే నేరస్తులకు భయం లేకుండా పోయింది. ఇలాంటి హేయమైన ఘటనలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.” అని ఆయన విమర్శించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన పెను సంచలనంగా మారింది. పోలీసులు కేసును నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.

