పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి.! ఓకే అయిపోయిందోచ్.!

ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కించుకున్నాడు ‘ఇస్మార్ట్ డైరెక్టర్’ పూరి జగన్నాథ్. నిజానికి, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా స్థానంలో ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది పూరి జగన్నాథ్. కానీ, పూరి జగన్నాథ్ చెప్పిన ‘ఆటో జానీ’ కథ విషయంలో చిరంజీవి కొన్ని మార్పులు చేర్పులు చేయడం, ఆ విషయంలో కొంత గందరగోళం వెరసి.. ఆ ప్రాజెక్ట్ అలా అటకెక్కేసింది.

‘గాడ్ ఫాదర్’ సినిమాలో పూరి జగన్నాథ్ నటుడిగా కాస్సేపు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ‘నా ఆటో జానీ కథ ఏం చేశావ్.?’ అంటూ పూరి జగన్నాథ్‌ని చిరంజీవి అడిగారు. ‘దాన్ని పక్కన పెట్టేశాను. ఇంకో మంచి కథ సిద్ధం చేస్తున్నాను..’ అంటూ పూరి చెప్పాడు.

తాజాగా, పూరి – చిరంజీవి మధ్య కొత్త ప్రాజెక్ట్ విషయమై చర్చలు జరిగాయనీ, కథ విషయమై అంతా క్లియర్ అనీ తెలుస్తోంది. అతి త్వరలో ఈ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమాని అటు పూరి సొంత బ్యానర్ అలాగే చిరంజీవి సొంత బ్యానర్ కలిసి నిర్మించబోతున్నాయట.

పూరి కనెక్ట్స్ కాకుండా.. పాత బ్యానర్‌ని పూరి ఈ సినిమా కోసం తెరపైకి తెస్తాడని అంటున్నారు.