Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరు కావడాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుతో రాజధానిపై వారికున్న ‘నిజమైన చిత్తశుద్ధి’ ఏంటో ప్రజలకు అర్థమైందని ఆయన విమర్శించారు.
తుగ్లక్ పాలనకు ప్రజలు సిద్ధంగా లేరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాజధాని చట్టబద్ధత తీర్మానాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర వ్యాఖ్యలపై లోకేశ్ సెటైర్లు వేశారు. “పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తానని జగన్ అంటున్నారు. కానీ, గత ఎన్నికల్లో ప్రజలు జగన్కు చూపించిన బ్లాక్బస్టర్ (11 సీట్లు) ఇంకా సరిపోలేదేమో! ఆయన చూపిస్తానంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదు” అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు మళ్ళీ ‘తుగ్లక్ పాలన’ చూడటానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
అమరావతిని కూడా నేనే కట్టానంటారేమో!: జగన్ మోహన్ రెడ్డికి ‘ఆత్మలతో మాట్లాడే అలవాటు’ ఉందని, రేపు పొద్దున అమరావతిని కూడా తానే నిర్మించానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధానిని మార్చాలనే ఆలోచన ఒక్క జగన్కు తప్ప మరెవరికీ రాదని, పరామర్శల పేరుతో ఆయన కేవలం వివాదాలు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీని వదిలి బెంగళూరుకు పయనం: రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రాజధాని అంశంపై చర్చ జరుగుతుంటే, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన జగన్ అసెంబ్లీకి రాకుండా బెంగళూరుకు వెళ్లడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ పర్యటనల సమయంలో పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం వంటి అప్రజాస్వామిక పనులు ఉండేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, ప్రోటోకాల్ విషయంలోనూ ఎలాంటి వివాదాలు లేవని గుర్తుచేశారు.
ఏప్రిల్ 2న పార్లమెంట్లో తీర్మానం: రాష్ట్ర విభజన చట్టంలో సవరణలు కోరుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ఏప్రిల్ 2న పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. కనీసం అప్పుడైనా వైసీపీ తన ద్వంద్వ వైఖరిని వీడి స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందో లేదో చూడాలని ఆయన సవాల్ విసిరారు. రాజధాని రైతులు, ప్రజల ఆశలను వమ్ము చేసే హక్కు ఎవరికీ లేదని లోకేశ్ తేల్చి చెప్పారు.

