Yarlagadda Venkat Rao: రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ద్వంద్వ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా మోసపోయారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హనుమాన్ జయంతి, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం వంటి పవిత్ర సమయాల్లో అమరావతి అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు రావడం రాష్ట్రానికి శుభపరిణామమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఇకపై అమరావతిని ఎవరూ కదిలించలేరని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనికి సంపూర్ణ చట్టబద్ధత కల్పిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతిని అంగీకరించిన జగన్, అధికారంలోకి రాగానే తన రాజకీయ లబ్ధి కోసం ‘మూడు రాజధానుల’ డ్రామాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

“ఒకరోజు ఒక మాట, మరుసటి రోజు మరో మాట మాట్లాడటం జగన్ నైజం. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంటే, ఏపీలో మాత్రం మూడు రాజధానులంటూ ప్రజలను గందరగోళానికి గురిచేశారు.”- ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.
అమరావతి కేవలం ఒక ప్రాంతం కాదని, అది శాతవాహనుల రాజధానిగా, బౌద్ధ క్షేత్రంగా గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతమని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తన దూరదృష్టితో అటువంటి పవిత్ర ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేస్తే, జగన్ దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.
151 సీట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలను మోసం చేసినందుకే, గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీని 11 సీట్లకే పరిమితం చేసి తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో అమరావతి బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంటే, వైకాపా ఎంపీలు వాకౌట్ చేయడం ప్రజల ఆకాంక్షలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర శాశ్వత రాజధానిగా వెలుగొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

