Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“పవన్ అన్నా.. డాక్టర్ల సలహా మేరకు తగినంత విశ్రాంతి తీసుకోండి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశ, శ్వాసగా పనిచేసే మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని లోకేష్ తన సందేశంలో పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కల్యాణ్, శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ సహా పలు పరీక్షలు నిర్వహించి, చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని సూచించారు.

శస్త్రచికిత్స విజయవంతం:- శనివారం సాయంత్రం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్ కొద్దిరోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన అధికారిక పర్యటనలు, సమీక్షా సమావేశాలను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసైనికులు, కూటమి నాయకులు భారీగా సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు.

