Pope Francis: ప్రపంచాన్ని కదిలించిన మానవతావాది… పోప్ ఫ్రాన్సిస్‌ ఇక లేరు

వాటికన్ నగరం ఈ ఉదయం విషాదంలో మునిగిపోయింది. ప్రపంచ కేథలిక్ చర్చికి తలమానికంగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం ఉదయం తన నివాసమైన కాసా సాంటా మార్టాలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా పోప్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. డబుల్ న్యుమోనియా, శ్వాస సంబంధిత సమస్యలు, కిడ్నీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నెల ప్రారంభంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన మళ్లీ ఆరోగ్యంగా తిరిగొస్తారని భావించారు.

అయితే, ఆరోగ్యం మరింత బలహీనపడటంతో సోమవారం ఉదయం తుది శ్వాస విడిచినట్టు వాటికన్ అధికార వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. పోప్‌గా పదవి చేపట్టే ముందు జార్జ్ మరియో బెర్గొగ్లియోగా గుర్తింపు పొందిన ఆయన, అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. సామాజిక సమస్యలపై, నిరుపేదల హక్కులపై గళమెత్తిన మత గురువిగా ఆయన పేరు సంపాదించారు.

అనేక సందర్భాల్లో వివిధ మతాల మధ్య ఐక్యతకు పిలుపునిచ్చారు. “ప్రేమ, మానవత్వం మతాలను మించి ఉంటాయి” అనే సందేశంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేశారు. తన చివరి రోజు కూడా ప్రజలతో గడిపారు. ఈస్టర్ పండుగ సందర్భంగా సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన ప్రార్థన సభలో వేలాదిమంది భక్తులకు ప్రత్యక్షంగా సందేశం ఇచ్చారు. అనారోగ్యం కారణంగా చాలా రోజుల తర్వాత బయట కనిపించిన ఆయనను చూసి భక్తులు ఉద్వేగానికి లోనయ్యారు.

కానీ అది ఆయన చివరి సందేశంగా మిగిలిపోవడం విషాదాన్ని పెంచింది. మానవతా విలువల్ని తన జీవిత మార్గంగా తీసుకుని పనిచేసిన పోప్ మరణం ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది. పోప్ ఫ్రాన్సిస్ మృతిపై ప్రపంచ నలుమూలల నుంచి సంతాపం వెల్లువెత్తుతోంది. రాజకీయ నాయకులు, మతపెద్దలు, సామాన్యులు అందరూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.

నాని వల్లే కోర్ట్ హిట్టు || Director Geetha Krishna Reacts On Nani Comments || Hit 3 || Court || TR