Harish Rao Open Letter: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లలో స్థానిక రిజర్వేషన్లు: సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ

తెలంగాణలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న స్థానిక విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వందలాది పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ, పీజీ మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, అందులో సుమారు 450 సీట్లు (రాష్ట్ర కోటాలోని 25 శాతం) మేనేజ్‌మెంట్ కోటా కిందకు వస్తాయని హరీశ్ రావు తెలిపారు. ఈ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించకపోవడంతో, అవి ఓపెన్ కేటగిరీలో ఇతర రాష్ట్రాల వారికి దక్కుతున్నాయని ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం స్థానికులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తే, 450 సీట్లలో కేవలం 68 సీట్లు మాత్రమే ఇతర రాష్ట్రాలకు వెళతాయని, మిగిలిన 382 సీట్లు తెలంగాణ విద్యార్థులకే లభిస్తాయని ఆయన వివరించారు. ప్రస్తుత విధానం వల్ల మన విద్యార్థులు విలువైన అవకాశాన్ని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాల కోసం కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు, 2014 తర్వాత స్థాపించిన కాలేజీల్లో 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను స్థానికులకే కేటాయించిందని హరీశ్ రావు తెలిపారు. దీనివల్ల ఏటా 1,820 అదనపు ఎంబీబీఎస్ సీట్లు మన విద్యార్థులకు దక్కాయని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఈ నేపథ్యంలో, హరీశ్ రావు ప్రభుత్వం వెంటనే స్పందించి మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జారీ చేసిన పీజీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి, తెలంగాణ విద్యార్థుల హక్కులను కాపాడేలా కొత్త జీవో జారీ చేయాలని ఆయన తన లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.

Advocate Pepakayala Ramakrishna On Balakrishna Comments on Jagan | Telugu Rajyam