CM Chandrababu: “మాట ఇచ్చాం… మార్పు తెచ్చాం” అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తన సంకల్పాన్ని చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద నిన్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AMNS) ప్లాంట్కు శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో, నేడు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ భారీ పరిశ్రమ ఉత్తరాంధ్ర తలరాతను మార్చేయబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయితే, ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు నూతన దిక్సూచి అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు అవుతున్న ఈ కర్మాగారం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం ఇకపై ‘ఉక్కు ఆంధ్రా’గా పిలవబడుతుందని పేర్కొన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పూర్తయితే, ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.

డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితం: ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “కేంద్రం నుంచి అనుమతులు, ముడి ఖనిజం సరఫరా వరకు ప్రతి దశలోనూ వేగవంతమైన సహకారం అందింది.” “డబుల్ ఇంజన్ సర్కారు వల్లే కేవలం 21 నెలల్లోనే ఇంతటి మెగా ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగాం.” “ఈ ప్రాంతంలో ఒక కొత్త ‘స్టీల్ సిటీ’ నిర్మాణం కాబోతోంది, ఇది యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది” అని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
భయం నుంచి భరోసా వైపు.. గత ప్రభుత్వ తీరును పరోక్షంగా విమర్శిస్తూ.. 21 నెలల క్రితం ఉత్తరాంధ్ర ప్రాంతం కబ్జాలు, అక్రమ కేసులు, భయాందోళనలతో అల్లాడిపోయిందని సీఎం గుర్తు చేశారు. కానీ నేడు అదే ప్రాంతంలో అభివృద్ధి, అవకాశాలు, ఆకాంక్షలు వెల్లివిరుస్తున్నాయని, ప్రజల్లో భవిష్యత్తుపై భరోసా పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే మూడేళ్లలోనే ఈ అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ అందుతాయని హామీ ఇచ్చారు.
భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు పునాది పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

