BJP shifts focus to Telangana –
హైదరాబాద్: తెలంగాణపై పట్టుబిగించాలని బిజెపి పట్టుదలగా ఉన్నట్టు కన్పిస్తోంది. తెలంగాణలో అధికార టీఆరెస్ కు కాంగ్రెస్ కు మధ్యనే ఇప్పటి వరకు రాజకీయ సంఘర్షణ ఉండేది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా తీవ్ర విమర్శలు చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. బిజెపిని ఇప్పటి వరకు మిత్ర పక్షంగా గానీ శత్రు పక్షంగా గానీ చూడని టీఆరెస్ ఇప్పుడు కమలదళంపై తన వైఖరిని స్పష్టం చేసుకోవలసి ఉంటుంది.
Read More – ‘అంతా డ్రామా’: మోడీ ప్రభుత్వంపై రకుల్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ కూడా సంతృప్తికరంగా లేరని వెల్లడించే సంఘటనలు గతంలో జరిగాయి. జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు పడడం ఇది రెండో సారి. ఈసారి నడ్డా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని, కరోనా పరీక్షలకు సరైన సదుపాయాలు లేవని నడ్డా విమర్శించారు. కరోనా సోకి, ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఒక విలేకరి మరణించిన విషయాన్ని నడ్డా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల బిజెపి కార్యాలయాల నిర్మాణానికి నడ్డా ఆన్ లైన్ వేదికగా ఢిల్లీ నుంచి భూమి పూజ చేసిన సందర్భంలో ఆయన ఈ విమర్శలు చేశారు. తెలంగాణలో కరోనా బాధితులకు ఐసియులో రోజుకు లక్ష రూపాయలు ఖర్చుఅవుతోందని, పరిస్ధితి తీవ్రతకు ఇది అడ్డం పడుతోన్నదని ఆయన అన్నారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 48 కోట్ల నుంచి 85 కోట్లకు పెరగడానికి కారణం టిఆర్ ఎస్ ప్రభుత్వ అవినీతేనన్నారు.
ఆంధ్ర లో పని కాదు..తెలంగాణ పైనే గురి

తెలంగాణలో టిఆర్ ఎస్ కు పోటీగా ఎదగడంలో కాంగ్రెస్ విఫలమవుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్ధానాల్లో గెలుపొందిన బిజెపికి తెలంగాణ గడ్డ ఇంకా ఆశాజనకంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణలో అధికంగా బలపడగలమని బిజెపి కేంద్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే బండి సంజయ్ వంటి డైనమిక్ లీడర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. త్వరలో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధిక స్ధానాలు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో మతం ప్రభావం, ఉత్తర భారత దేశ సంస్కృతి ఉండడం బిజెపికి కలిసి వచ్చే విషయం. ఆంధ్రాలో బిజెపి, పవన్ కళ్యాణ్ కలిసినా అక్కడ తెలంగాణ స్థాయిలో పార్టీ బలపడే అవకాశం లేనందువల్ల బిజెపి తెలంగాణపైనే ఫోకస్ పెడుతున్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మీదనే దృష్టి పెట్టిన కేసీఆర్ కేద్రంలోని బిజెపి ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్టే కనిపిస్తోంది. నడ్డా మాటిమాటికీ తెలంగాణ ప్రభుత్వంపై రాళ్లు విసరడం, గవర్నర్ తమిళ సై డేగకళ్లతో పరిశీలించడం భవిష్యత్తులో ఈ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
—- శాంతా రామ్
BJP shifts focus to Telangana, Andhra is a distant dream for BJP as of now. BJP national President JP Nadda’s harsh comments on Telangana shows that BJP is now focusing on grabbing power in Telangana.
