మీడియాపై రాఘ‌వేంద్ర‌రావ్ కోడ‌లు ఫైర్

సెల‌బ్రిటీల‌పై మీడియా క‌థ‌నాలు ఒక్కోసారి సీరియ‌స్ అవుతుంటాయి. చ‌ట్ట ప‌రంగానూ చ‌ర్య‌ల‌కు దారి తీస్తుంటాయి. ప్ర‌స్తుతం ఓ ఎఫైర్ వార్త ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మార‌డంతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి భార్య స‌ద‌రు ప‌త్రిక నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు. ఆధారం లేని వార్త‌లు రాస్తారా? అంటూ ఫైర‌య్యారు. ఆ క‌థ‌నంతో తీవ్రంగా మ‌న‌స్థాపానికి గుర‌య్యార‌ని తెలుస్తోంది. అంతేకాదు .. త‌న భ‌ర్త‌పై ఎఫైర్ క‌థ‌నం రావ‌డంతో దానిపై ఆ సెల‌బ్రిటీ వైఫ్ కూడా ఫైర‌వ్వ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ ఎపిసోడ్ వివ‌రాల్లోకి వెళితే.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి త‌న‌ భార్య క‌నిక దిల్లాన్ నుంచి విడిపోయార‌ని.. రెండేళ్ల క్రిత‌మే ఈ జంట విడాకులు తీసుకున్నార‌ని మీడియాలో నేడు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనికి ఒక రోజు ముందు(నిన్న‌నే) ప్ర‌ముఖ బాలీవుడ్ క‌థానాయిక దియా మీర్జా త‌న భ‌ర్త సాహిల్ సంఘా నుంచి విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దియా ఇలా భ‌ర్త నుంచి విడిపోవ‌డానికి కార‌ణం ప్ర‌కాష్ కోవెల మూడి భార్య‌.. `జ‌డ్జిమెంట‌ల్ హై క్యా` ర‌చ‌యిత్రి క‌నిక థిల్లాన్ అంటూ స‌ద‌రు ప‌త్రిక క‌థ‌నం వెలువ‌రించింది.

క‌నిక‌తో సాహిల్ ఎఫైర్ కార‌ణంగానే దియా మీర్జా విడాకులు తీసుకుంటున్నార‌ని ప్ర‌చురించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ క‌థ‌నంపై దియా మీర్జా సీరియ‌స్ అయ్యారు. త‌మ మ‌ధ్య మూడో వ్య‌క్తి ఎవ‌రూ లేర‌ని ఆ క‌థ‌నం నిరాధార‌మ‌ని దియా మీర్జా ట్విట్ట‌ర్ ద్వారా ఖండించారు. ఇలాంటి వార్త‌లు వ‌చ్చినందుకు క‌నిక దిల్లాన్ కి దియా సారీ చెప్పారు. ఇక సాహిల్ తో ఎఫైర్ అంటూ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నంపై క‌నిక దిల్లాన్ సైతం సీరియ‌స్ అయ్యారు. ఆ వార్త‌ల‌న్నీ నిరాధార‌మ‌ని క‌నిక ఆవేద‌న చెందారు.

దియా మీర్జా- సాహిల్ జంట‌ను తన జీవితంలో ఎప్పుడూ క‌ల‌వ‌నేలేద‌ని తెలిపారు. ఎలాంటి నిజం లేకుండా ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి ప్ర‌చారం చేస్తారా? అంటూ క‌నిక సామాజిక మాధ్య‌మాల ద్వారా ఫైర‌య్యారు. ప్ర‌స్తుతం బాలీవుడ్ మీడియా వ్య‌వ‌హారంపై తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనూ చ‌ర్చ సాగుతోంది.