`కులం`పై క‌త్తి క‌ట్టిన ఏకైక సీఎం

తెలుగు రాష్ట్రాల్లో కులం జాఢ్యం గురించి తెలిసిందే. అగ్ర‌కులం.. అణ‌గారిన కులం.. బ‌డుగు బ‌ల‌హీన కులం అంటూ జ‌నం కొట్టుకోవ‌డం చూస్తున్న‌దే. ఈ కులాల‌కు నాయ‌కులు ఉంటారు. వీళ్లే కులాల్ని రెచ్చ‌గొడుతూ త‌మ ప‌బ్బం గ‌డుపుకుంటారు. కులాధినేత‌లు త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటూ ఆస్తులు వెన‌కేసుకుంటారు. అయితే ఒక‌సారి ఏదైనా ఒక అగ్ర‌కులం ఈ ఆట‌కు తెర తీస్తే ఆ ఆట‌ను ఇత‌ర కులాల వాళ్లు త‌ప్ప‌నిస‌రిగా ఆడాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌. కులం రంగును పులుముకుని ఈ ఆట‌లో చెమ‌టోడ్చాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న‌త విద్యావంతులు పెరుగుతున్నా కులపిచ్చి మాత్రం త‌గ్గ‌డం లేదు. కొన్ని చోట్ల ఈ కులం అణ‌గిమ‌ణిగి ఉంటున్నా.. కీల‌క‌మైన రాజ‌కీయాల్లో.. అధికారం చేప‌ట్టే వారిలో.. అడ్మినిస్ట్రేష‌న్ లో ఇది పాతుకుపోవ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రంగానూ క‌నిపిస్తోంది. కుల‌జాఢ్యం అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. కులం కోసం కొట్టుకు చ‌చ్చే వాళ్లు పెరుగుతున్నారే కానీ త‌ర‌గ‌డం లేదు.

అయితే ఈ స‌న్నివేశం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి న‌చ్చ‌డం లేదా? అంటే ఆయ‌న మాట్లాడుతున్న శైలి చూస్తుంటే ఈ కుల‌ఝాడ్యం మ‌త మౌఢ్యం విష‌యంలో ఒక‌ర‌కంగా ఏహ్య‌భావం ఆయ‌న‌లో ఉందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఒక కులానికి ప్ర‌తినిధిగా జ‌గ‌న్ ఉన్నార‌ని.. ఆయ‌న ముఖ్య‌మంత్రి అవ్వ‌డం వెన‌క ఆ కులం ప‌ని చేసింద‌ని.. గెలిచాక కూడా ఆయ‌న మంత్రి వ‌ర్గంలో కులానికే ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇప్ప‌టికీ ఆయ‌న‌ను కులాధిప‌తిగానే చూస్తున్నారు ప్ర‌త్య‌ర్థులు. అయితే ఆయ‌న‌లో ఆ కుల‌పిచ్చి బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా ఇన్న‌ర్ గా ఉందా? అన్న‌దానిని ఆయ‌న పాల‌నావిధానం.. చేత‌ల్లో చ‌ర్య‌లే తేట‌తెల్లం చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు. నేడు స్వాతంత్య్ర దినోత్స‌వ సంద‌ర్భంగా జెండా వంద‌నం చేశాక జ‌గ‌న్ ఇచ్చిన స్పీచ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. అందులో ఏదో తెలియ‌ని క‌సి క‌నిపించింది. కులంపై అంత‌ర్లీనంగా ఏదో కోపం క‌నిపించింది. కులానికి మ‌తానికి అతీతంగా ప్ర‌తి 50 మంది నిజ‌మైన ప్ర‌జ‌ల‌ కోసం వ‌లంటీర్ క‌ష్ట‌ప‌డాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి ఒక్క‌రికి సెంటున్న‌ర ఇళ్ల స్థ‌లం ఇవ్వాల‌ని నిర్ణ‌యించామ‌ని.. రైతులు, చేనేత కార్మికులు.. మ‌త్స్య కార్మికుల‌కు అన్ని వ‌ర్గాల‌కు వ‌రాల జ‌ల్లులు కురిపిస్తామ‌ని అన్నారు. చాలా ప్ర‌భుత్వాల్లా మేనిఫెస్టోల పుస్త‌కాల్ని ముద్రించి చెత్త‌బుట్ట‌లో వేయ‌మ‌ని.. వాటిని అమ‌ల్లో పెడ‌తామ‌ని అన్నారు. కోటా బియ్యం పేరుతో పురుగులు తినే బియ్యాన్ని ఇస్తున్నార‌ని .. అది మార్చి పేద‌ల‌కు మంచి బియ్యం ఇస్తామ‌న్నారు. రైతు ప్ర‌భుత్వంగా ఉండేందుకు చేయాల్సిన‌ది అంతా చేస్తున్నామ‌ని.. స‌బ్సిడీలు ఇస్తున్నామ‌ని అన్నారు. కులాల‌కు అతీతంగా పార్టీల‌కు అతీతంగా ఈ సేవ‌లన్నీ చేస్తామ‌ని వ‌లంటీర్ల నుంచి ప్రామిస్ తీసుకున్నారు. ఒక ర‌కంగా ప‌ట్ట‌ణాల‌కు దూరంగా విసిరేసి ఉన్న ప‌ల్లెటూళ్ల‌లో ఇన్నాళ్లు రెవెన్యూకి సంబంధించి కానీ.. లేదా ప‌థ‌కాల‌కు సంబంధించి కానీ ప‌ట్టించుకున్న నాధుడే లేడు. ఇప్పుడు అవ‌న్నీ ప‌ట్టించుకునేందుకు పేద‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం క‌ల్పించేందుకు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను రూపొందించ‌డం హ‌ర్ష‌నీయం. అయితే ఈ ప‌థ‌కాల‌న్నీ ఫ‌లాల్ని అందించ‌డంలో తేడా జ‌ర‌గ‌క‌పోతే జ‌గ‌న్ ఆశ‌యం ఫ‌లిస్తుంది. ఇక త‌మ పార్టీకి ఓటు వేయ‌కుండా ఉన్న‌ క‌రుడుగ‌ట్టిన ప్ర‌తిప‌క్ష పార్టీల వాళ్లు త‌మ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటేసేలా చేస్తామ‌ని సీఎం జ‌గ‌న్ స‌వాల్ విస‌ర‌డం చూస్తుంటే నిష్ప‌క్ష‌పాతంగానే ఈ ప‌నుల‌న్నీ చేయ‌ద‌లిచారా? అనిపించ‌క మాన‌దు. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. కులాన్ని న‌మ్ముకుంటే మ‌ళ్లీ సీఎం అవ్వ‌డం కుద‌ర‌ని ప‌ని. ఆ త‌ప్పును ఇప్ప‌టి నుంచే జ‌గ‌న్ దిద్దుకుంటున్నార‌నే స‌న్నివేశం చెబుతోంది.